మందుబాబులకు బిగ్ షాక్- రేట్లు భారీగా పెంపు
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ.. ఇవ్వాళ వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించింది. ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తోన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రతిపాదనలను శాసన సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి.
బడ్జెట్ మొత్తం వ్యయం 3,27,747 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,50,933 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 54,374 కోట్ల రూపాయలు, రుణాల చెల్లింపు కింద 22,441 కోట్ల రూపాయలు. అత్యధికంగా విద్యారంగానికి రూ.37,587 కోట్లను కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వం.

మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన వాటా 11 శాతం. మహిళా- శిశు సంక్షేమానికి రెండో ప్రాధాన్యతను ఇచ్చింది. దీనికి రూ.24,166 కోట్లను ఈ వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించింది. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో మహిళా శిశు సంక్షేమానికి కేటాయించిన వాటా ఏడు శాతం. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి నాలుగు శాతం నిధులను మంజూరు చేసింది. దీని విలువ 14,950 కోట్ల రూపాయలు.
బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది. మద్యంబాబులకు షాక్ ఇచ్చింది. చల్లచల్లని బీర్ అమ్మకాలు ఇక వేడెక్కబోతోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీర్ల అమ్మకాలపై వసూలు చేస్తోన్న ఎక్సైజ్ ట్యాక్స్ను అదనంగా 10 శాతం పెంచుతున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బడ్జెట్లో చేర్చినట్లు చెప్పారు.
దీనివల్ల సంవత్సరానికి ఖజానాకు అదనంగా 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం భారీగా ఉంటోంది కర్ణాటకలో. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బీర్ల అమ్మకాల ద్వారా మాత్రమే 800 కోట్ల రూపాయల ఆదాయాన్ని చవి చూసింది.

ఆ ఆర్థిక సంవత్సరం మొత్తానికీ 390.66 లక్షల కార్టన్ బాక్సుల మేర బీర్లు అమ్ముడయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంఖ్య రెట్టింపు. ఆ సంవత్సరంలో 268.83 లక్షల కార్టన్ బాక్సుల మేర బీర్లు అమ్మకాలు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ ట్యాక్స్ను 10 శాతం పెంచడం వల్ల వార్షిక ఆదాయం 1,200 కోట్ల రూపాయలకు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications