కేసుల్లో సహకరిస్తానని చెబుతున్నప్పటికీ మీరు కావాలనే చేస్తున్నారు?
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో హాజరయ్యారు. ఏపీజే అబ్దుల్కలాం రోడ్డులో ఉన్న ఈడీ కార్యాలయానికి ఆయన మధ్యాహ్నం 12.00 గంటలకు చేరుకున్నారు. అనంతరం ఎంట్రన్స్ వద్ద ఉన్న కౌంటర్లో నోటీసులు చూపించి లోపలికి వెళ్లారు.
మనీలాండరింగ్కు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ శివకుమార్ కు వారం రోజుల క్రితం ఈడీ సమన్లు జారీచేసింది. అయితే, అవి ఏకేసులనే విషయం తెలియదని శివకుమార్ చెబుతున్నప్పటికీ ఆదాయానికి మంచి ఆస్తులున్నాయనే ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించినదని సమాచారం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతోపాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో కావాలనే సమన్లు జారీచేశారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఇటువంటి వేధింపులవల్ల రాజ్యాంగ పరమైన, రాజకీయ పరమైన తన విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతోందని, విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగానే ఉన్నాన్నారు. ఈ సమన్ల వల్ల ఢిల్లీ కార్యాలయానికి రావల్సి వచ్చిందన్నారు. 2019 సెప్టెంబరు మూడోతేదీన శివకుమార్ ను అరెస్ట్ చేశారు. అదే సంవత్సరం అక్టోబరులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిలిచ్చింది.
పన్ను ఎగవేసేందుకు ప్రయత్నించారంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరు కోర్టులో ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేశారు. అందులో డీకేను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. నగదును అక్రమంగా చలామణి చేసేందుకు ప్రయత్నించారనే కేసును నమోదు చేశారు.