మామిడి చెట్టుపై కోటి రూపాయలు; కర్ణాటక ఎన్నికల్లో బయటపడుతున్న నోట్ల కట్టలు!!
మరో వారం రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కర్ణాటక ఎన్నికలలో ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు చేతులు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అధికారులు 300 కోట్లకు పైగా లెక్క చూపించని డబ్బులను సీజ్ చేశారు. ఒక్క బెంగళూరులోనే 82కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అంటే కర్ణాటక ఎన్నికలలో ధనప్రవాహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే తాజాగా మైసూర్లో ఓ వ్యక్తి ఇంట్లో మామిడి చెట్టుపై దాచిన కోటి రూపాయలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి తన ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టుపై కోటి రూపాయలను దాచిపెట్టాడు. ఐటీ అధికారులు దాడులు చెయ్యటానికి వస్తున్నారని తెలిసిన సదరు వ్యక్తి డబ్బు కనిపించకుండా మామిడి చెట్టుపైన జాగ్రత్తగా సెట్ చేశాడు. అయితే తనిఖీలలో భాగంగా చెట్టు వద్దకు వెళ్ళిన అధికారులు చెట్టుపై ఒక బాక్సు ఉండటాన్ని గమనించారు.

మామిడి చెట్టు పై బాక్సులు ఉండటం గమనించి, వాటిని కిందికి దించి చూశారు. ఇక ఆ బాక్సులలో నోట్ల కట్టలు కనిపించడంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. పుత్తూరు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన అశోక్ కుమార్ రాయ్ సోదరుడైన సుబ్రమణ్య రాయ్ ఇంట్లో ఐటీ అధికారులు చేసిన సోదాలలో భాగంగా మామిడి చెట్టుపై కోటి రూపాయలు పట్టుకున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే కోట్లకొద్దీ డబ్బులు చేతులు మారుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఒకపక్క పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూనే మరోపక్క ప్రజల ఓటు బ్యాంకు కోసం ప్రలోభాల పర్వానికి తెర తీస్తున్నారు. ఈసారి కర్ణాటక ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గతం కంటే ఎక్కువగా ధన ప్రవాహం కొనసాగుతుందని భావిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఇంకెన్ని నోట్లకట్టలు బయట పడతాయో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications