బీజేపీ జెండా పీకేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ డీసీఎం, రెండు గ్యారెంటి !
బెంగళూరు/బెళగావి: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్సీ లక్ష్మణ సవదికి అథణి నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వకుండా బీజేపీ హైకమాండ్ వేరే వ్యక్తికి టిక్కెట్ ఇచ్చింది. దెబ్బకు రగిలిపోయిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది తాను ఏం నేరం చేశానని నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు అంటూ బీజేపీ హైకమాండ్ మీద దుమ్మెత్తిపోశారు.
నేను ఏమైనా నా భార్యకు, నా కొడుక్కి ఎమ్మెల్యే టిక్కెట్లు అడిగానా ?, లేకుంటే పక్కింటోళ్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వమని చెప్పానా అంటూ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. తనకు అథణి టిక్కెట్ ఇవ్వమని మాత్రమే తాను అడిగానని, చివరి నిమిషం వరకు టిక్కెట్ నీకే అంటూ నమ్మించి చివరికి బీజేపీ తనను మోసం చేసిందని లక్ష్మణ సవది బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు.

పీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ బీజేపీ రెబల్ నాయకుడు లక్ష్మణ సవది కోసం బెళగావికి ప్రత్యేక విమానం పంపించి ఆయన్ను బెంగళూరు పిలిపించుకున్నారు. బెంగళూరులో మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకేశీతో లక్ష్మణ సవది చర్చలు జరిపారు. కాంగ్రెస్ కుటుంబంలోకి రావడానికి లక్ష్మణ సవది అంగీకరించారని మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ బెంగళూరులో మీడియాకు చెప్పారు.
లక్ష్మణ సవది బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ సవది తాను కాంగ్రెస్ నాయకులకు రెండు డిమాండ్లు పెట్టానని, అందులో అథణి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు తనకు ఇవ్వాలని, రెండవది తన నియోజక వర్గానికి ఎక్కువ నిధులు మంజూరు చెయ్యాలని చెప్పానని అన్నారు.

తన డిమాండ్లకు మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అంగీకరించారని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని లక్ష్మణ సవది అన్నారు. తరువాత మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. లక్ష్మణ సవది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బెళగావి జిల్లాలో బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్ అని బీజేపీ కార్యకర్తలే అంటున్నారు.












Click it and Unblock the Notifications