దళితులు ఎదురు వస్తే స్నానం చేసి బయటకు వస్తున్న సీఎం సోదరుడు, కాంగ్రెస్ లీడర్ దెబ్బ!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీ నాయకుల మద్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖా మంత్రి హెచ్.డి. రేవణ్ణ దళితులు ఎదురు వస్తే ఇంటికి వెళ్లి స్నానం చేసి బయటకు వస్తారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎ. మంజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ప్రజా పనుల శాఖా మంత్రి హెచ్.డి. రేవణ్ణ బయటకు వచ్చే సమయంలో ఎదురుగా ఎవరైనా దళితులు వెళితే ఆయన మళ్లీ ఇంటికి వెళ్లి స్నానం చేసి ప్రత్యేక పూజలు చేసి బయటకు వస్తారని ఆరోపించారు.
మంత్రి అనే కొంచెం కూడా బాధ్యత రేవణ్ణకు లేదని, ఆయన మూడనమ్మకాలు నమ్ముతున్నారని, దళితులను తీవ్రస్థాయిలో అవమానిస్తున్నారని మాజీ మంత్రి ఎ. మంజు ఆరోపించారు. దళితులను చులకనగా, నీచంగా చూసే రేవణ్ణ వెంటనే వివరణ ఇవ్వాలని ఎ. మంజు డిమాండ్ చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉందని, అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా, లేకున్నా తనకు ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి పరిస్థితుల్లో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుటుంబ సభ్యులకు, ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామికి తన మద్దతు ఉండదని ఎ. మంజు తేల్చి చెప్పారు.
భవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ది జరిగిపోదని, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎ. మంజు అన్నారు.మంత్రి హెచ్.డీ. రేవణ్ణ ఆయన ఇంటి నుంచి డబ్బులు తీసుకువచ్చి భవనాలు నిర్మిస్తున్నారా ? అని ఎ. మంజు ప్రశ్నించారు.
ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ నుంచి హోం శాఖను వేరే వారికి బదిలి చేసి దళితులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎ. మంజు ఆరోపించారు. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో నిత్యం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.