పుట్టగోసిలో పదవి, ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? మాజీ ప్రధాని కొడుకు, బీజేపీ కక్ష రాజకీయాలు!
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ కుమారుడు, మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ చేతిలో చాల సంవత్సరాలుగా ఉన్న కేఎంఎఫ్ (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్) పదవిని జారకిహోళి కుటుంబ సభ్యులు తన్నుకు పోయారు. పుట్టగోసిలో అధ్యక్ష పదవి ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? అని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కొడుకు హెచ్.డీ. రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేఎంఎఫ్ అధ్యక్ష పదవికి ఎలాంటి పోటీ లేకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యే బాలచంద్ర జారకిహోళికి ఆ పదవి దక్కనుంది. ప్రభుత్వం అధికారికంగా ఆ ప్రకటన వెల్లడించాలి. ఇంత కాలం మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు హెచ్.డీ. రేవణ్ణ కేఎంఎఫ్ అధ్యక్ష పదవిలో ఉన్నారు.
కేఎంఎఫ్ అధ్యక్ష పదవి చెయ్యి జారిపోవడంతో హెచ్.డీ. రేవణ్ణ అసహనంగా ఉన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన రేవణ్ణ పుట్టగోసిలో అధ్యక్ష పదవి ఉంటే ఎంత ? ఊడిపోతే ఎంత అని అన్నారు. తాను రైతుల సంక్షేమం కోసం ఆలోచించానని, అందుకే కేఎంఎఫ్ అధ్యక్ష పదవి ఎన్నికల కోసం వేసిన నామినేషన్ వెనక్కి తీసుకున్నానని అన్నారు.
ఇలాంటి పదవుల కోసం తాను మనసు పాడుచేసుకోనని, తనకు తన జిల్లా (హాసన్) ప్రజలు ముఖ్యమని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ అన్నారు. పాలు సరఫరా చేసే వారికి దేవేగౌడ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురు కాకూడదని తాను కేఎంఎఫ్ అధ్యక్ష పదవి ఎన్నికల కోసం వేసిన నామినేషన్ వెనక్కి తీసుకున్నాని హెచ్.డీ. రేవణ్ణ అన్నారు.
దేవేగౌడ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కక్ష రాజకీయాలు చేస్తున్నారని హెచ్.డీ. రేవణ్ణ ఆరోపించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప, బీజేపీ నాయకులు ఎంత కాలం ఇలాంటి కక్ష రాజకీయాలు చేస్తారో తాను చూస్తానని హెచ్.డీ. రేవణ్ణ మండిపడ్డారు.