స్కూళ్లు, కాలేజీలు, ఫీజుల స్ట్రక్చర్ పై సీఎం డీకే శివకుమార్ తాజా నిర్ణయాలు
కర్ణాటకలో విద్యా రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం అయిదుమంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యా ఖర్చుల నియంత్రణ, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఉపాధి నైపుణ్యాల పెంపు వంటి పలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
ఈ ఉపసంఘానికి ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇందులో.. ఉన్నత విద్యాశాఖ మంత్రి బసవరాజ్ రాయరెడ్డి, హోమ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, పాఠశాల విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల పనితీరు, పరీక్షల నిర్వహణ, అక్కడ వసూలు చేసే ఫీజులు, విద్యార్థులపై ఒత్తిడి వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

నెల రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇటీవల చోటుచేసుకున్న పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేయడానికి ఈ సబ్ కమిటీ మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, విద్యా సంస్థల పరీక్షల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి అవసరమైన మార్గదర్శకాలను ఈ ప్యానెల్ సిఫార్సు చేస్తుంది. నియామక ప్రక్రియలను గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఒక నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాల కమిటీ భావిస్తోంది.
ప్రైవేటు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు వసూలు చేస్తున్న ఫీజులను క్రమబద్ధీకరించడం ఈ కమిటీ పరిధిలోని మరో ముఖ్యమైన అంశం. దీనివల్ల విద్యార్థుల కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. మార్కుల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై కూడా కమిటీ దృష్టి సారించనుంది. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రాలను బలోపేతం చేసేందుకు సిఫార్సులు చేయనుంది.
ప్రభుత్వ పాఠశాలలు, ప్రీయూనివర్సిటీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఈ కమిటీ తగిన ప్రణాళికలను సూచించనుంది. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, అత్యాధునిక ప్రయోగశాలలు, లైబ్రరీల ఏర్పాటు, హాస్టల్ సదుపాయాల కల్పన వంటి ప్రణాళికలు ఇందులో భాగంగా ఉండనున్నాయి. ప్రస్తుత పారిశ్రామిక, ఐటీ సంస్థల అవసరాలకు తగ్గట్టుగా విద్యా ప్రణాళికను మార్చడం ద్వారా విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టనుంది.
ఈ కమిటీ కార్యకలాపాలకు ఉన్నత విద్యాశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. నివేదిక రూపకల్పనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలతో పాటు సబ్జెక్ట్ నిపుణులతో ఈ ఉపసంఘం విస్తృత చర్చలు జరపనుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, విద్యార్థుల స్కాలర్ షిప్స్, హాస్టల్ వసతులను మరింత చేరువ చేయడంపై కూడా కమిటీ నివేదికలో స్పష్టత ఇవ్వనుంది.














Click it and Unblock the Notifications