corona కలకలం: దేశంలో తొలి మరణం కర్ణాటకలోనే.. సౌదీ నుంచి వచ్చి..
బెంగళూరు: కరోనావైరస్(కొవిడ్-19) కారణంగా భారతదేశంలో తొలి మరణం నమోదైంది. బుధవారం కర్ణాటకలోని కలబుర్గిలో 76ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్దిఖీ అనే వృద్ధుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతడు కరోనావైరస్ కారణంగానే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది.
Recommended Video
కరోనా లక్షణాలతో సౌదీ నుంచి వచ్చిన ఈ వృద్ధుడు ఇటీవల కర్ణాటకలోని కలబుర్గి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పుణెకు పంపగా.. వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అనే తేలింది. అంతకుముందు తెలంగాణలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ అతడు చికిత్స పొందినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడి మృతిపై తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ఆరోగ్యశాఖ సమాచారం అందించింది. కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నయం కావడంతో అతడ్ని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇది ఇలావుండగా, భారతదేశంలో మొత్తం 74 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి 125 దేశాలకు పాకింది. ఇప్పటి వరకు కరోనా సోకి సుమారు 5వేల మంది ప్రాణాలు కోల్పోగా, లక్షా 35వేల మంది కరోనా బారిన పడి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
తొలుత చైనాలోని వూహాన్ నగరంలోనే కరోనా వైరస్ను గుర్తించిన విషయం తెలిసిందే. చైనాలోనే 3వేల మందికిపైగా మృతి చెందారు. చైనా తర్వాత ఇటలీలోనే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. 1061 మంది ఈ దేశంలో ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్లో కూడా సుమారు 500 మంది మరణించారు. దీంతో ఆయా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి.












Click it and Unblock the Notifications