కర్ణాటక: రిసార్ట్లో కొట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఓ రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఆ రిసార్టులో ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకరు ఏకంగా ఆసుపత్రి పాలయ్యారట.
గణేష్ అనే ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అనే ఎమ్మెల్యే తల పైన బాటిల్తో దాడి చేయడంతో గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని ఖండించింది. రిసార్టులో ఏదో జరుగుతోందని బీజేపీ అనుమానం వ్యక్తం చేసింది.

ఎమ్మెల్యేలను శుక్రవారం నాడు ఈగల్టన్ రిసార్టుకు తరలించారు. శనివారం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ జరిగి, గాయాలయినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ నేతలు పలువురు ఆసుపత్రికి క్యూ కట్టారు.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఈ ప్రచారాన్ని కొట్టి పారేశారు. ఇది అవాస్తవమని, ఎలాంటి గొడవ లేదని, ఎమ్మెల్యేలు అందరూ కలిసే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని, శాసన సభా పక్ష సమావేశానికి కాని ఎమ్మెల్యేలు కూడా త్వరలో తమతో చేరుతారన్నారు.
ఆనంద్ సింగ్ ఆసుపత్రిలో చేరడంపై తనకు ఎటువంటి సమాచారం లేదని మరో కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం పరమేశ్వర అన్నారు. ఆనంద్ సింగ్ ఆసుపత్రిలో ఉన్నాడని మీడియా చెబుతోందని, ఒకవేళ అదే నిజమైతే తనకు సమాచారం వస్తుందన్నారు. ఇప్పటికైతే తనవద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు. దీనిపై డీకే శివకుమార్తో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదన్నారు.












Click it and Unblock the Notifications