కరుణ హెల్త్ బులెటిన్ విడుదల, వెంకయ్య పరామర్శ, లండన్ డాక్టర్లు పిలిపించే యోచన
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం పరామర్శించారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి చేరుకుని, కరుణ తనయుడు స్టాలిన్ను కలిసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంతకుముందు ఉదయం తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయిన్ డీఎంకే నేతలు ఎంకే స్టాలిన్, కణిమొళిలతో మాట్లాడి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాగా, శనివారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కావేరీ ఆసుపత్రిలో ఎంకే స్టాలిన్ను కలిసి ఆరోగ్యంపై ఆరా తీశారు.
కరుణ ఆరోగ్యంపై ఆసుపత్రి శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. డీఎంకే ప్రెసిడెంట్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిత్యం పర్యవేక్షిస్తున్నామని, నిపుణులైన వైద్యులచే ఇంటెన్సివ్ కేర్లో చికిత్స అందిస్తున్నామని తెలిపింది. కరుణానిధికి చికిత్స కోసం లండన్ నుంచి వైద్యులను పిలిపించే యోచనలో ఆయన కుటుంబం ఉంది.
కరుణానిధి కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష
కరుణానిధి త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులతో కరుణానిధి సొంతూరు తిరువారూర్లో పార్టీ కార్యకర్త తమిమ్ గుండెపోటుతో మరణించారు.
శనివారం ఉదయం తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆసుపత్రికి చేరుకుని కరుణానిధిని పరామర్శించారు. ఆ తర్వాత స్టాలిన్తో సమావేశమై ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మధ్యాహ్నం కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసుపత్రికి వచ్చి కరుణ ఆరోగ్యంపై స్టాలిన్తో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, తిరునావుక్కరసు, ఈవీకేఎస్ ఇళంగోవన్ కూడా ఆసుపత్రికి వచ్చి ఆరా తీశారు.
ఆజాద్ మాట్లాడుతూ.. కరుణానిధికి నాణ్యమైన వైద్యం అందుతోందని, అందరి ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటారన్నారు. కరుణ కోలుకోవాలంటూ కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.