బాధ్యత పళ్లం, కావూరిలపై: పోల్స్ ముందే టి అని అజిత్
న్యూఢిల్లీ: కేబినెట్ సమావేశంలో సమైక్యాంధ్ర వాదనను బలంగా వినిపించే బాధ్యతను సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు, పళ్లం రాజుల పైన పెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం కావూరి ఇంట్లో వారు భేటీ అయిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో తెలంగాణ, రాయల తెలంగాణ, సమైక్యాంధ్రలపై చర్చ సాగింది. విభజన అనివార్యమైనందున అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ అంటే అంగీకరించాలని కావూరి చెప్పారట. అయితే అంతిమంగా అందరూ సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపారు.
కేబినెట్ సమావేశంలో సమైక్యాంధ్ర వాదనను గట్టిగా వినిపించాలని కావూరి, పళ్లం రాజులను కోరారు. విభజనకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని వారు సూచించారు. ఈ భేటీలో కావూరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, చిరంజీవి, పళ్లం రాజు, జెడి శీలం, ఎంపీలు అనంత వెంకట్రామి రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, ఎస్పీవై రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు: అజిత్ సింగ్
సార్వత్రిక ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ అన్నారు. తెలంగాణ ఐకాస నేతలు ఆయనను కలిశారు. పది జిల్లాల తెలంగాణకు మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని అయితే, బడ్జేట్ లేదా ప్రత్యేక సమావేశాలో వస్తుందన్నారు. ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పడుతుందని, పది జిల్లాల తెలంగాణకే తాము కట్టుబడి ఉన్నామన్నారు.