దోషిగా ఉండను: కేబినెట్నుండి కావూరి డీసెంట్, వాకౌట్
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే దేశానికి మంచిదని తాను నమ్ముతున్నానని, గత రెండు సమావేశాల్లోనూ ఇదే చెప్పానన్నారు. విభజిస్తే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తాను చెప్పానని, అయినా కేబినెట్ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే విభజన బిల్లు టేబుల్ ఐటమ్గా రావటం కూడా సీమాంధ్ర ప్రజల హృదయాలను గాయపర్చిందని చెప్పారు.
తప్పుల తడకగా ఉన్న బిల్లును కేంద్రం ఆమోదించటం సమాఖ్య విధానానికి భంగం కలిగిస్తుందన్నారు. ఇది ప్రజల్ని చట్ట వ్యతిరేక ధోరణిలోకి నెడుతోందని, దీనివల్ల జాతికి మేలు జరగదన్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర చాలా నష్టపోతుందని, బిల్లు యావత్తూ సీమాంధ్రకు శూన్య వాగ్దానాలతో చట్టబద్ధత లేకుండా ఉందని తెలిపారు.
కానీ తెలంగాణకు మాత్రం అన్ని రకాల కేటాయింపులు ఉన్నాయన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కూడా కేంద్రం అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులో సవరణలు చేయకుండా పార్లమెంటులో ప్రవేశ పెడితే రెండు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడే కాకుండా భవిష్యత్తులోను నష్టం జరుగుతుందన్నారు.
అసెంబ్లీ తిరస్కరించినప్పుడు ఏ రాష్ట్రాన్నీ విభజించలేదని, ఇప్పుడు కేంద్రం మొండిగా ముందుకెళితే రాబోయే ప్రభుత్వాలు కూడా తమ స్వలాభం కోసం విభజించుకుంటూ పోతే సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ తాత్కాలిక లబ్ధి కోసం విభజించారన్న అపఖ్యాతి యూపిఏ ప్రభుత్వంపై చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.