మోడీ, రాహుల్: కేజ్రీకి మ్యూజిక్ డైరెక్టర్ ట్విట్టర్ ట్రబుల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ 'ట్విట్టర్' చిక్కుల్లో పడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన పార్టీకి చెందిన వ్యక్తిగా భావిస్తున్న అతను చేసిన ట్వీట్కు కేజ్రీవాల్ స్పందించారు. అది ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
సంగీత దర్శకుడు విశాల్ చేసిన ట్వీట్కు అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. విశాల్... మోడీని, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఓ బాలుడి మనస్తత్వం కలిగిన వ్యక్తి, మర్డరర్ మధ్య చిక్కుకుపోయిందని, ఇప్పుడు భారత్ పరిస్థితేమిటని అతను ట్వీట్ చేశాడు. దానికి కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ టైమ్స్ నౌ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. అతను ఉపయోగించిన 'మర్డరర్' అనే పదం మోడీని ఉద్దేశించి చేసిందిగా భావిస్తున్నారు. విశాల్ ఎఎపి మద్దతుదారు.
దీనిపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... అరవింద్ కేజ్రీవాల్ తన ట్వీట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.