ఆదివాసీ మధును కొట్టి చంపిన ఘటన.. హైకోర్టు కీలక నిర్ణయం, సుమోటోగా విచారణ!
Recommended Video
కొచ్చి: ఆహారం దొంగిలించాడనే కోపంతో ఆదివాసీ యువకుడు మధు చిందకి అనే యువకుడిని కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అత్తపడిలో కేవలం బియ్యం దొంగిలించినందుకు ఓ గుంపు ఎగబడి మధును దారుణంగా కొట్టి చంపింది.
ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేరళ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (కెల్సా) ఇన్చార్జ్గా ఉన్న జస్టిస్ కే సురేంద్రమోహన్ హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. దీంతో కేరళ హైకోర్టు స్పందించి ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
కొట్టాక సెల్ఫీలు, సెల్ఫీ వీడియోలు...
మతిస్థిమితం లేని ఆదివాసీ మధును కట్టేసి దారుణంగా కొట్టడమేకాకుండా.. అదేదో వినోద క్రీడ అయినట్లు ఆ సమయంలో కొందరు గాయాలతో విలవిలలాడుతున్న మధుతో సెల్ఫీలు, సెల్ఫీ వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ దారుణం ఒక్క కేరళనే కాదు యావత్ దేశాన్ని కుదిపేసింది.
సమాజానికి, రాష్ట్రానికి సిగ్గుచేటు...
ఆదివాసీ యువకుడు మధును కొట్టిన ఘటనపై జస్టిస్ కే సురేంద్రమోహన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన మన సమాజానికి, రాష్ట్రానికి సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల అందరూ సిగ్గుతో తలదించుకోవాలి అంటూ తన లేఖలో సురేంద్రమోహన్ పేర్కొన్నారు.
ఆహారం దొంగిలించే దుస్థితి...
నిజానికి కేరళలోని గిరిజన ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ సంస్థలు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. పేదరికం తగ్గించేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు సైతం కృషి చేస్తున్నాయి. అయినా మధు ఆహారం దొంగిలించే పరిస్థితులు ఏర్పడటాన్ని బట్టి చూస్తే.. ప్రభుత్వ పథకాలు అంత సమర్థంగా అమలవ్వడం లేదనే విషయం అర్థమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఆదివాసీలకు అందేందుకు ఈ పథకాల్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్రజాప్రయోజన వ్యాజ్యంగా...
మరోవైపు ఆదివాసీ యువకుడు మధును కొట్టి చంపిన ఘటనలోని తీవ్రత దృష్ట్యా దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా భావించి.. ఈ కేసును సుమోటోగా విచారించాలని కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటోనీ డొమినిక్ నిర్ణయించారు. ‘ఇది సమాజానికి కళ్లు తెరిపించే ఘటన. సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను సమీక్షించి.. సమగ్ర మార్పులు చేయాల్సిన అవసరముంది..' అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.