వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం... తక్షణం రద్దు చేయాలని డిమాండ్..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం గురువారం(డిసెంబర్ 31) అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. ఆ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని తీర్మానం ద్వారా డిమాండ్ చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఇలాగే కొనసాగితే కేరళపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫుడ్ సప్లై నిలిచిపోతే రాష్ట్రం ఆకలితో అల్లాడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు గురువారం కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. నిజానికి రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని మొదట గవర్నర్ మహమ్మద్ ఖాన్ తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర పరిధిలో లేని అంశంపై చర్చను చేపట్టి సమస్యకు పరిష్కారం కనుగొంటారని గవర్నర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగ్గా... ప్రభుత్వాన్ని గవర్నర్ నియంత్రించాలనుకోవడం సరికాదని సీఎం విజయన్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు మహమ్మద్ ఖాన్ అసెంబ్లీ ఒకరోజు ప్రత్యేక సమావేశానికి అనుమతినిచ్చారు.
కాగా,కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఏడాది అగస్టులోనే పంజాబ్ కూడా అసెంబ్లీ తీర్మానం చేసింది.కొత్త చట్టాలతో రైతులను కార్పోరేట్ దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు వ్యవసాయ సంక్షేమ,అభివృద్ది బాధ్యతల నుంచి తప్పించుకునేలా కొత్త చట్టాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో నెల రోజులకు పైగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కేంద్రం రైతులతో చర్చలు జరిపినా అవేవీ సఫలం కాలేదు.
బుధవారం(డిసెంబర్ 30) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రైతులతో జరిపిన చర్చల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు కేంద్రమంత్రి నరేంద్ర తోమర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుమారు 5గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ ప్రతిష్ఠంభనకు తెరపడలేదు. దీంతో జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.