కేరళ సీఎం పినరయి విజయన్ ఆస్తులెంతో తెలుసా... సొంత వాహనం కూడా లేని నేత...
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం(మార్చి 16) నామినేషన్ దాఖలు చేశారు. కన్నూరు జిల్లాలోని ధర్మదం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ పత్రాల్లో విజయన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.54లక్షలుగా పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు రూ.51.95లక్షలుగా,చరాస్తులు రూ.2.04లక్షలుగా వెల్లడించారు.
కేరళ ఎన్నికలు... 33 మంది సిట్టింగులకు విజయన్ షాక్... అభ్యర్థుల తొలి జాబితా విడుదల...
2020-2021 సంవత్సరానికి తన ఆదాయం రూ.2.87లక్షలుగా తెలిపారు.తనకు రెండు సొంత ఇళ్లు ఉన్నట్లు పేర్కొన్న విజయన్... సొంత వాహనాలేవీ లేవని పేర్కొనడం గమనార్హం. టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయిన తన భార్య కమల పేరిట రూ.35 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే 3.3లక్షల విలువ చేసే 80గ్రా. బంగారం ఉన్నట్లు తెలిపారు. 2020-2021 సంవత్సరానికి ఆమె ఆదాయం కేవలం రూ.16,400గా పేర్కొనడం గమనార్హం. ఇద్దరికీ ఎటువంటి అప్పులు లేవని వెల్లడించారు.
తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పినరయి విజయన్ పేర్కొన్నారు. అందులో ఒకటి 1997లో ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు నమోదైన ఎస్ఎన్సీ లవలిన్ కేసు కాగా మరొకటి అనుమతి లేకుండా రహదారుల దిగ్బంధనం చేసినందుకు నమోదైన కేసు.
కాగా,140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. కేరళలో ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా మారింది. కానీ ఈసారి కేరళ ప్రజలు మరోసారి ఎల్డీఎఫ్ కూటమికే పట్టం కట్టబోతున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. విజయన్ పాలన పట్ల చాలామంది సంతృప్తికరంగా ఉండటంతో తిరిగి ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. మరోవైపు యూడీఎఫ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తమదే గెలుపు అన్న ధీమాతో ఉంది.