Kerala gold scam:దావూద్ గ్యాంగ్తో సంబంధాలు,శివశంకర్కు ఊరట..ఎన్ఐఏ ఏం చెబుతోంది..?
తిరువనంతపురం: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉందా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇదే విషయాన్ని కేసును విచారణ చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. కేరళ నుంచి బంగారంను స్మగ్లింగ్ చేసి వాటిని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో విచారణ సాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగిన సందర్భంలో దావూద్ ఇబ్రహీం కంపెనీతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలున్నాయని ఎన్ఐఏ వెల్లడించింది.
వెలుగులోకి కొత్త విషయాలు
గతేడాది అక్టోబరులో సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇదే విషయమై ఎన్ఐఏకు ఓ నివేదిక సమర్పించింది. ఈ నివేదికనే ఎన్ఐఏ కోర్టు ముందు ఉంచింది. ఈ ఏడాది జూలైలో 30 కిలోల బంగారంను దౌత్యపరమైన మార్గాల ద్వారా స్మగ్లింగ్కు గురైంది. తిరువనంతపురం విమానాశ్రయంలో ఈ బంగారంను అధికారులు పట్టుకుని తీగ లాగగా డొంక మొత్తం కదిలింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని కస్టడీలో ఉంచుకుని విచారణ చేస్తే మరిన్ని పెద్ద తలకాయలు బయటపడే అవకాశాలున్నాయని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉంటే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రమీజ్ అనే వ్యక్తి తనకు టాంజానియాలో వజ్రాల వ్యాపారం ఉందని చెప్పినట్లు ఎన్ఐఏ తెలిపింది. అందుకోసమే టాంజానియా నుంచి బంగారం కొనుగోలు చేసి దుబాయ్లో అమ్మేవాడని విచారణ సందర్భంగా చెప్పినట్లు సమాచారం.
దావూద్కు వజ్రాల వ్యాపారం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ దావూద్ ఇబ్రహీంపై విడుదల చేసిన ఒక లేఖ మరియు అమెరికా ట్రెజరీ శాఖ పబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ షీట్లలో అతని గ్యాంగ్ ఆఫ్రికా దేశాల్లో బంగారం కార్యకలాపాలు నిర్వహిస్తోందనే చెప్పినట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. దావూద్ సన్నిహితుడు ఫెరోజ్ అనే వ్యక్తి టాంజానియాలో దావూద్కు చెందిన వజ్రాల వ్యాపారంను చూసుకుంటున్నాడని తను దక్షిణ భారత రాష్ట్రానికి చెందిన వాడని విచారణలో తేలినట్లు ఎన్ఐఏ వివరించింది. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కుట్ర జరిగినందున గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విచారణ లోతుగా చేయాల్సి ఉన్నందున కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఆరునెలల పాటు బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఐఏ కోర్టును కోరింది.
ఫోన్ను ఫార్మాట్ చేసిన మరొక నిందితుడు
ఇక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి మొహ్మద్ అలీకి కూడా నేరచరిత ఉందని ఎన్ఐఏ తెలిపింది. 2010లో కేరళ ప్రొఫెసర్ చేయిని నరికిన కేసులో నిందితుడిగా ఉన్నాడని అయితే సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిర్దోషిగా విడుదల చేయడం జరిగిందని ఎన్ఐఏ కోర్టుకు వెల్లడించింది. ఇక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మొహ్మద్ అలీ పేరు వెలుగులోకి రాగానే జూలై 19వ తేదీన తన ఫోనను ఫార్మాట్ చేయడం జరిగిందని ఎన్ఐఏ చెప్పుకొచ్చింది.
శివశంకర్కు ఊరట
ఇక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించింది. అక్టోబర్ 23 వరకు శివశంకర్ను అరెస్టు చేయరాదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ చాలా పెద్ద నేరమని అన్నారు కేరళ ప్రతిపక్షనేత రమేష్ చెన్నితాల. దావూద్తో సంబంధాలు కలిగి ఉన్నాయని ఎన్ఐఏ విచారణలో తేలిందని చెప్పిన ఆయన మరింత లోతుగా విచారణ చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు ఉగ్రవాద లింకులు ఉన్నాయని కాంగ్రెస్ ముందునుంచి చెబుతోందని ఇప్పుడు ఎన్ఐఏ విచారణలో అదే తేలిందన్నారు.