మోదీ-విజయన్ మధ్యలో నేను బలి - స్వప్న సురేశ్ మరో సంచలనం - దిమ్మతిరిగేలా ఎన్ఐఏ రియాక్షన్
గల్ఫ్ దేశాలు, భారత్ మధ్య సంబంధాలను ప్రభావితం చేసేలా.. దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా.. చరిత్రలోనే అరుదైన నేరాల్లో ఒకటిగా నిలిచిన 'కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు'లో కీలక పరిణామాం చోటుచేసుకుంది. డిప్లొమాటిక్ పాస్ పోర్టుల ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి కేరళకు భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా జరిగిన వ్యవహారంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న స్వప్న సురేశ్ మరో బాంబు పేల్చారు. అదే సమయంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సైతం ఆమెకు చుక్కలు చూపించింది.

స్వప్న బెయిల్ పిటిషన్..
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ, ఇప్పటికే అరెస్టయిన స్వప్న సురేశ్ కొచిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో బెయిట్ పిటిషన్ వేశారు. దానిపై సోమవారం విచారణ జరిగింది. గతంలో తాను యూఏఈ ఎంబసీలో పని చేసిన మాట వాస్తవమేనని, అయితే, డిప్లొమాటిక్ బ్యాగేజీలో బంగారం ఉందన్న సంగతి తెలీదని, పైఅధికారుల ఆదేశాల మేరకు కొన్నిసార్లు కస్టమ్స్ వాళ్లకు ఫోన్లు చేసేదాన్నేతప్ప ప్రత్యక్షంగా నేరానికి పాల్పడలేదని, అందుచేత తనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టును స్వప్న అభ్యర్థించారు. అంతేకాదు..

మోదీ-విజయన్ మధ్యలో నేను..
విదేశాల నుంచి కేరళకు బంగారం అక్రమ రవాణా వ్యవహారం సీఎం పినరయి విజయన్ కు తెలిసే జరిగిందని, సీఎం పర్యవేక్షణలోని ఐటీ శాఖలో స్వప్న సురేశ్ కీలక అధికారిణి అని, ఐటీ కార్యదర్శి శివశంకర్ కు కూడా ఆమె బాగా దగ్గరి వ్యక్తంటూ విపక్ష బీజేపీ రచ్చ చేయడంతో.. దేశ ప్రతిష్టతో ముడిపడిన ఈ అంశాన్ని కేంద్రమే దర్యాప్తు చేయాలంటూ ప్రధాని మోదీకి కేరళ సీఎం లేఖ రాయడం, ఆ వెంటనే ఎన్ఐఏ రంగప్రవేశం చేయడం తెలిసిందే. కాగా, ఢిల్లీలోని మోదీ సర్కారు, కేరళలోని విజయన్ సర్కారు మధ్య ఆధిపత్యపోరులో తనను బలి పశువును చేస్తున్నారంటూ స్వప్న సురేశ్ మరో బాంబు పేల్చారు. రెండు ప్రభుత్వాల మధ్య గొడవలో తన పేరును వాడుకుంటున్నారని, మీడియా సైతం ఇందుకు సహకరిస్తున్నదని, నిజానికి తనకే పాపం తెలీదని స్వప్న తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.

స్వప్నకు షాకిచ్చిన ఎన్ఐఏ
కేసుతో సంబంధం లేదని, రాజకీయ కక్షలతోనే తనను ఫ్రేమ్ చేశారంటూ బెయిల్ కోసం స్వప్న సురేశ్ చేసిన వాదనతో ఎన్ఐఏ కోర్టు విభేధించింది. సోమవారం నాటి విచారణలో బెయిల్ పిటిషన్ ను కొట్టిపారేస్తూ ఆమెకు షాకిచ్చిన కోర్టు అనూహ్య వ్యాఖ్యలు చేసింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేశ్ కీలక పాత్ర పోషించారనడానికి తగిన ప్రాథమిక ఆధారాలన్నీ ఉన్నాయని, ఆమె చేసిన పనులు చట్టవ్యతిరేక కర్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని సెక్షన్ 15 కిందికి వస్తాయని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. దీంతో దర్యాప్తు దశలోనే ఈ కేసు మరింత బలపడనట్లయింది. జులై 5న తిరువనంతపురం ఎయిర్ పోర్టులోని డిప్లొమాటిక్ బ్యాగేజీలో 30 కేజల బంగారం పట్టుబడటంతో ఈ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications