స్పీకర్ తర్వాత మంత్రి! ప్రజల సొమ్ముతో మసాజ్ చేయించుకున్నారు!
తిరువనంతపురం: ఇప్పటికే కేరళ అసెంబ్లీ స్పీకర్ ప్రభుత్వ సొమ్ముతో ఖరీదైన కళ్ల జోడు కొనుక్కుని విమర్శలు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు మరో మంత్రి ఆయన బాటలో నడిచారు. ప్రభుత్వ సొమ్ముతో ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకున్న కేరళ ఆర్థిక శాఖ మంత్రి టీఎస్ థామస్ ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
థామస్ తనకు ఆయుర్వేదిక్ మసాజ్ కోసం అయిన ఖర్చు రూ.1.20లక్షలు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించడం గమనార్హం. గత వారం కేరళలో బడ్జెట్ ప్రవేశపెట్టిన థామస్.. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వ్యయాలను తగ్గిస్తూ కఠినమైన నిర్ణయాలను తీసుకున్నారు.
అలాంటిది తన సొంత ఖర్చుల కోసం రూ.1.20లక్షలు ఖజానా నుంచి తీసుకున్నారని వార్తలు బయటకు రావడంతో విషయం వివాదాస్పదమైంది. 2016 డిసెంబరులో కొట్టకల్ ఆర్య వైద్యశాలలో థామస్ మసాజ్ చికిత్స చేయించుకున్నారు.
అప్పుడు రూమ్ అద్దె రూ.80వేలు సహా రూ.1.20 లక్షల బిల్లును ప్రభుత్వ సొమ్ము నుంచి కట్టినట్లు బహిర్గతమైంది. ఇటీవల కేరళ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్ రూ.50వేల ఖరీదైన కళ్లజోడుకు రాష్ట్ర ఖజానా నుంచి రీయంబర్స్మెంట్ తీసుకుని వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.