మావల్లే, అప్పుడేం చేశావ్: కేసీఆర్పై కిషన్రెడ్డి నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం నిప్పులు చెరిగారు. గవర్నర్కు అధికారాలు కట్టబెట్టడంపై కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ, మోడీని కేసీఆర్ టార్గెట్ చేయడం సరికాదన్నారు.
అసలు తమ పార్టీకి పూర్తి మెజారీటీ రావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాడు బిల్లు ఆమోదం పొందినప్పుడు, సోనియా గాంధీని కలసి సంబరాలు చేసుకున్నప్పుడు గవర్నర్ అధికారాలపై కేసీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అన్నీ తెలిసిన జేఏసీ కూడా ఎందుకు స్పందించడంలేదో చెప్పాలన్నారు. బిల్లు ఏకపక్షంగా కాకుండా అందరి అభిప్రాయంతోనే ఆమోదించారని, ఇది కేసీఆర్కు కూడా తెలుసన్నారు.
కానీ, అంతా సంస్కారహీనంగా వ్యవహరిస్తున్నారని, కయ్యానికి కాలు దువ్వుతున్నారన్నారు. మజ్లిస్ కనుసన్నల్లో తెరాస ఇదంతా చేస్తోందన్నారు. తెలంగాణ కోసం బీజేపీ త్యాగం చేసిందన్నారు. రాష్ట్ర ఆవిర్భవ ఉత్సవాలకు కేంద్రాన్ని పిలవకపోవడం సరికాదన్నారు. తెలంగాణ పైన ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బిల్లు ఆమోదం పొందేలా తాము చూశామన్నారు. బిల్లు ఆమోదంపై కొత్త విషయాలను జోడించే అవకాశం లేదన్నారు.
సర్వేపై జీవన్ రెడ్డి ఆగ్రహం
ఈ నెల 19న తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న సర్వేపై కాంగ్రెస్ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన కేసీఆర్కు ఇప్పుడు వారు దొంగల్లా కనబడుతున్నారా? అని ప్రశ్నించారు. సర్వే రోజున పనులన్నీ మానుకుని మరీ ఉండాలని చెప్పడం అవివేకమన్నారు.
సర్వే రోజున కుటుంబంలోని అందరూ ఇంట్లోనే ఉండాలని చెప్పడం... వంటగది, టీవీలను తనిఖీ చేస్తామనడం సరైంది కాదని, మైనార్టీల ఇళ్లలోకి వెళ్లి తనిఖీ చేయడం ఇబ్బందిగా ఉంటుందన్న విషయం మరచిపోయారా అన్నారు. దినసరి కూలీలు పని చేస్తేనే వారి కుటుంబం గడుస్తుందని అలాంటిది అందరూ ఇంటివద్దే ఎలా అన్నారు.