కొడనాడు ఎస్టేట్ జయ, శశికళ గదుల్లో రూ. 900 కోట్లు ? ఐటీ అధికారుల సోదాలు !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్ పై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు గురి పెట్టినట్లు తెలుస్తోంది. జయలలిత మరణం తరువాత తమిళనాడులో చోటుచేసుకుంటున్న సంఘటనలు సంచలనాలకు దారితీస్తోంది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్ పై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు గురి పెట్టినట్లు తెలుస్తోంది. జయలలిత మరణం తరువాత తమిళనాడులో చోటుచేసుకుంటున్న సంఘటనలు సంచలనాలకు దారితీస్తోంది.
నీలగిరి జిల్లాలోని జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో గత నెల 23వ తేదీన అక్కడ సెక్యూరిటీగార్డుగా పని చేస్తన్న వ్యక్తిని అతిదారుణంగా హత్య చేసి పరారైనారు. దుండగుల దాడిలో జయలలిత ఎస్టేట్ లో పని చేస్తున్న వాచ్ మెన్ తీవ్రగాయాలై కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
9 మందిని పట్టుకున్నారు
కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితులు జయలలిత, శశికళ గదుల్లో ఉన్న భారీ నగదు, విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారని సమాచారం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న నీలగిరి జిల్లా పోలీసులు తమిళనాడు, కేరళలో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడు లేడంటే ?
కొడనాడు ఎస్టేట్ హత్య, చోరీ కేసులో ప్రధాన నిందితుడు జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరో ప్రధాన సూత్రదారి సయాన్ తీవ్రగాయాలై కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వ్యక్తి కోసం పోలీసులు ఇప్పటికీ గాలిస్తున్నారు.
రూ. 900 కోట్ల నగదు ఉంది ?
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. జయలలిత, శశికళ బెడ్ రూంల్లో రూ. 200 కోట్లకు పైగా నగదు, అసెంబ్లీ ఎన్నికలు (2016) సమయంలో మూడు కంటేనర్లలో పట్టుబడిన రూ. 570 కోట్లు కాకుండా మిగిలిన రూ. 900 కోట్ల నగదు కొడనాడు ఎస్టేట్ లో ఉందని కనకరాజ్ చెప్పడంతో మేము అక్కడికి వెళ్లామని పోలీసులకు చెప్పారు.
జయ, శశి గదుల్లో భారీ మొత్తంలో నగదు ?
కొడనాడు ఎస్టేట్ లోని జయలలిత, శశికళ గదుల్లోని సూట్ కేసుల్లో భారీ మొత్తంలో ఉన్న నదు కట్టలు చూసి తాము బిత్తరపోయామని ఇద్దరు నిందితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు పరిశీలించారు.
కొడనాడులో ఐటీ శాఖ అధికారులు ?
బుధవారం ఉదయం 7.30 గంటలకు మూడు వాహనాల్లో సుమారు 12 మంది కొడనాడు ఎస్టేట్ లోకి వెళ్లారు. తరువాత కొడనాడు ఎస్టేట్ లోని 11 ప్రవేశ ద్వారాలు మూసివేశారు. కొడనాడు ఎస్టేట్ లోకి ఎవ్వరూ ప్రవేశించకుండా సుమారు ఒక కిలో మీటరు దూరంలో ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.
కోయంబత్తూరు ఐటీ కార్యాలయం
కొడనాడు ఎస్టేట్ లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుసుకున్న మీడియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులతో సహ ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. కోయంబత్తూరులోని ఐటీ అధికారులను మీడియా సంప్రదించారు.
చెన్నై నుంచి చప్పుడు కాకుండా ?
మా కార్యాలయం నుంచి ఎవ్వరూ కొడనాడు ఎస్టేట్ కు వెళ్లలేదని, ఒక వేళ చెన్నై నుంచి ఎవరైనా వచ్చారేమో మాకు తెలీదని, అక్కడి అధికారులకు సమాచారం ఇవ్వలేదని కోయంబత్తూరు ఆదాయపన్ను శాఖ అధికారులు మీడియాకు చెప్పారు.
ఆదాయపన్ను శాఖ గురి
పట్టపగలు అధికారులు జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో సోదాలు చెయ్యడం, స్థానిక పోలీసులను సైతం లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో ఐటీ శాఖ అధికారులు కొడనాడు ఎస్టేట్ లో ప్రవేశించారని ప్రచారం జరుగుతోంది.
పోలీసులు, టెలికాం అధికారులు
కొడనాడు ఎస్టేట్ హత్య జరిగిన ప్రాంతంలో టెలికాం రంగానికి చెందిన అధికారులు గురువారం పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో అక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఫోన్లు వెళ్లాయి ? అని ఆరా తీస్తున్నారు. హత్య కేసులోని నిందితులు కొందరిని గురువారం పోలీసులు వెంటతీసుకు వెళ్లి కొడనాడు ఎస్టేట్ లో విచారణ చేస్తున్నారు.