కేరళ నర్స్లపై సెక్సియెస్ట్ కామెంట్స్: కేజ్రీ పార్టీ నేత సారీ
న్యూఢిల్లీ: కేరళ నర్సులపై అనుచిత వ్యాఖ్యలంటూ దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత కుమార్ విశ్వాస్ బుధవారం క్షమాపణ చెప్పారు. అదే సమయంలో ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని కుమార్ విశ్వాస్ తెలిపారు. తాను కవి సమ్మేళన్ కార్యక్రమంలో ఆ వ్యాఖ్యలు చేశానని, తనకు ఎవరిని కించపర్చాలనే ఉద్దేశ్యం లేదన్నారు.
కుమార్ విశ్వాస్ వ్యాఖ్యల పైన కాంగ్రెసు పార్టీ నేతలతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కుమార్ విశ్వాస్ తగ్గారు. బుధవారం కేరళ ఎఎపి సమన్వయకర్త మనోజ్ పద్మనాభన్ మాట్లాడుతూ.. కుమార్ విశ్వాస్ క్షమాపణలు చెప్పారని, దానిని మెయిల్ ద్వారా తనకు పంపించారని అన్నారు.

తాను చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, అవి ఓ కవి సమ్మేళన్ కార్యక్రమంలో భాగంగానే తాను చేశానని, ఆ వ్యాఖ్యలు పలువురిని గాయపర్చినందుకు క్షమాపణలు చెబుతున్నానని అయితే, తనకు ఉద్దేశ్య పూర్వకంగా ఎవరినీ కించపర్చాలని లేదని కుమార్ విశ్వాస్ తన మెయిల్లో పేర్కొన్నారని పద్మనాభన్ చెప్పారు. తన వ్యాఖ్యలు కొందరిని గాయపర్చినందుకు హృదయ పూర్వకంగా తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
కాగా, కుమార్ విశ్వాస్ గతంలో కేరళ నర్సులపై అభ్యంతరకర (సెక్సియెస్ట్) వ్యాఖ్యలు చేసినందుకు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కుమార్ విశ్వాస్ రచయిత నుండి రాజకీయ నాయకుడిగా మారారు. దాదాపు ఆరేళ్ల క్రితం ఆయన కేరళ నర్సులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా వీడియోలు నెట్లో కనిపించాయి.
23 నిమిషాల యూట్యూబ్ క్లిప్లో ఆయన మాట్లాడారు. గతంలో ఎవరైనా పురుషులు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే అక్కడ కేరళ నర్సులు ఉన్నందువల్ల సిస్టర్ అని పిలిచేందుకు కంఫర్ట్గా ఫీల్ అయ్యే వారని, కేరళకు చెందిన చాలామంది తమ ప్రొఫైల్స్లో వారి ఫోటోలు పెట్టరని, ఎందుకో తెలియదని వ్యాఖ్యానించారు. వారు నల్లగా ఉంటారని ఆయన పరోక్షంగా చెప్పారు. ఆ వ్యాఖ్యలపై ఆయన ఇప్పుడు క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications