మోడీతో కుమారస్వామి, ప్రజల దయతో సీఎం కాలేదన్న వ్యాఖ్యలపై దేవేగౌడ: శ్రీరాములు వార్నింగ్
బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం సాయంత్రం కలిశారు. ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. పలు అంశాలపై ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. కొత్త మంత్రి వర్గం ఏర్పాటు, శాఖల కేటాయింపుతో పాటు పలు విషయాలపై వారు చర్చించారు.
అయితే, వైద్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ, ఆమెతో పాటు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారు. వారిని కుమారస్వామి కలుసుకోలేకపోయారు. హోంశాఖ, నీటి పారుదల తదితర శాఖల కోసం ఇటు జేడీయు, అటు కాంగ్రెస్ పార్టీలు పట్టుబడుతున్నాయి. దీంతో మరోసారి భేటీ అయి చర్చిద్దామని నిర్ణయించుకున్నారు. భేటీలో గులాం నబీ ఆజాద్, కుమారస్వామి తదితరులు కూర్చున్నారు. కానీ శాఖల అంశం కొలిక్కి రాలేదు. మరోసారి భేటీ కానున్నారు.

కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏం చేయను
తాను కాంగ్రెస్ పార్టీ పైనే ఆధారపడి ఉన్నానని కుమారస్వామి చెప్పారు. ఆ పార్టీ అనుమతి లేకుండా ఏదీ చేయనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పారు. రాష్ట్రం పట్ల తనకు ఉన్న బాధ్యతకు కట్టుబడి ఉంటానని, సీఎంగా తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు.

ప్రజల దయతో కాదు కాంగ్రెస్ దయతో సీఎం అయ్యా
అంతకుముందు రోజు కుమారస్వామి షాకింగ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. స్పష్టమైన తీర్పు ఇవ్వాలని తాను ప్రజలను కోరానని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలకు రుణపడి ఉంటానని, ఇది తన స్వతంత్ర ప్రభుత్వం కాదని, స్పష్టమైన తీర్పు ఇవ్వమని ప్రజలను కోరితే ఇవ్వలేదని, దీంతో కాంగ్రెస్ పార్టీ వల్ల సీఎం పదవిలో ఉన్నానని, 6 కోట్ల ప్రజల తీర్పు వల్ల కాదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

కుమారస్వామి సీఎం కావాలని కాంగ్రెస్ పట్టుబట్టింది
కాంగ్రెస్ దయతోనే తాను సీఎంను అయ్యానని, ప్రజల తీర్పుతో కాదన్న కుమారస్వామి వ్యాఖ్యలపై జేడీయూ అధినేత, కుమారస్వామి తండ్రి దేవెగౌడ స్పందించారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తాము కాంగ్రెస్కు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చామని, అయితే కుమారస్వామే సీఎం కావాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టిందన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్తో సుమారు గంటసేపు చర్చ జరిగిందని, సీఎం పదవికి కుమారస్వామిని బలపరచాలని కాంగ్రెస్ అధిష్ఠానం తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు ఆ సమావేశంలో కాంగ్రెస్ నేతలు తనకు చెప్పారన్నారు.
వాళ్లది మేజర్ పార్టీ
మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, తనకు ఎలాంటి సమస్యలేదని నేను కాంగ్రెస్ పార్టీ నేతలతో చెప్పానని, అయితే కుమారస్వామే సీఎం కావాలని ఆజాద్, గెహ్లాట్ పట్టుపట్టారని, పైగా తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయం కూడా అదేనని చెప్పారని దేవెగౌడ అన్నారు. శాఖల కోసం పట్టుబడుతోందన్న వార్తలపై స్పందిస్తూ చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక శాఖ తమకు దక్కకుంటే మేనిఫెస్టోలో పెట్టినవి ఎలా అమలు చేయగలుగుతామన్నారు. కుమారస్వామి మంచి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ కాదంటుందని భావిస్తున్నారా అంటే.. ఆ నిర్ణయం వారికే వదిలేశామన్నారు. వాళ్లది మేజర్ పార్టీ అని, సీఎం పదవి మేం అడగకుండానే ఇచ్చారన్నారు.

శ్రీరాములు హెచ్చరిక
24 గంటల్లో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పుడు రుణమాఫీపై ఎగవేత ధోరణిని అవలంబిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు అన్నారు. కుమారస్వామి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. రుణమాఫీ చేస్తామంటూ స్పష్టమైన ప్రకటన చేసిన ప్రభుత్వం, హామీని నిలుపుకోవాల్సిందేనన్నారు. ప్రభుత్వం మాట తప్పితే రైతులతో కలిసి ఉద్యమాన్ని లేవదీస్తామన్నారు.












Click it and Unblock the Notifications