భర్తపై ఇనుప రాడుతో దాడి చేసి.. భార్యపై గ్యాంగ్రేప్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని తిల్డా నెవ్రా ప్రాంతంలో ఓ మహిళా కూలీ సామూహిక అత్యాచారానికి గురైంది. గురువారం రాత్రి ఆమె భర్తపై దాడి చేసిన దుండగులు, ఆమె ఇంట్లోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు రాయ్పూర్ ఎస్పీ ఓపి పాల్ తెలిపారు. బైకులపై వచ్చిన ముగ్గురు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాధిత దంపతులు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని తిల్దాలోని ఓ రైస్ మిల్లులో కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన ముగ్గురు యువకులు బాధితురాలి భర్తను ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టారు.
ఆ తర్వాత అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితుల దగ్గర ఉన్న ఓ సెల్ఫోన్ను, రూ. 500లను అపహరించి పరారయ్యారు. బాధితుల నివాసం నిర్మానుష్య ప్రాంతంలో ఉందని, అంతకుముందే నిందితులు వీరిపై కన్నేసి ఈ నేరానికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధితులిద్దరినీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.