Ladakh standoff: ఓ వైపు చర్చలంటూనే మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనా
న్యూఢిల్లీ: చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. ఓ వైపు ఈశాన్య లడఖ్ సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు భారత్తో జరుపుతూనే మరోవైపు సరిహద్దులోకి భారీగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ-చైనా ఆర్మీ) బలగాలను తరలిస్తోంది. బలగాల ఉపసంహరణకు అంగీకరిస్తున్నామంటూనే ఈ విధంగా చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఎల్ఏసీలో చైనా బలగాలు మోహరింపునకు సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. చైనా బలగాలు, ఆయుధ ట్యాంకులు, మిలిటరీ ట్రక్స్ ఎల్ఏసీ వెంట బారులు తీరినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ మేరకు టైమ్స్ నౌ తన కథనంలో వెల్లడించింది.
చైనాకు చెందిన సైన్యం సరిహద్దుకు సమీపంలో 350 ట్యాంకులను మోహరించినట్లు నివేదించారు. బీజింగ్ భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న అత్యంత అధునాతన ప్రధాన యుద్దభూమి ట్యాంక్ 'టైప్ 99' ను గణనీయమైన సంఖ్యలో మోహరించింది. పిఎల్ఎ తన ట్యాంకులను డెస్పాంగ్ ఏరియా, సౌత్ బ్యాంక్తో సహా పలు ప్రాంతాల్లో మోహరించింది.
గత మే 5 నుంచి తూర్పు లడఖ్లోని పలు చోట్ల భారతీయ, చైనా సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వన్ వ్యాలీలో హింసాత్మక ఘర్షణ తర్వాత 20 మంది భారతీయ ఆర్మీ సిబ్బంది అమరులవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అప్పటి నుంచి, అణుశక్తితో పనిచేసే రెండు దేశాలు తొమ్మిది రౌండ్ల చర్చలు జరిపాయి. కానీ, చెప్పుకోదగిన ముందడుగు మాత్రం పడలేదు. చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో ఆ జిత్తులమారి దేశాన్ని భారత్ విశ్వసించడం లేదు.
జనవరి 24న భారతదేశం, చైనా మధ్య తొమ్మిదవ రౌండ్ చర్చలు తూర్పు లడఖ్లోని ఎల్ఏసీకి చైనా వైపున ఉన్న మోల్డో సరిహద్దు పాయింట్ వద్ద జరిగాయి. ఈ సమావేశం 16 గంటలు కొనసాగింది. జనవరి 25 మధ్యాహ్నం 2:30 గంటలకు ముగిసింది. సైనిక కమాండర్ స్థాయి సమావేశానికి సంబంధించి సంయుక్త ప్రకటన విడుదలైంది, ఇది 'సానుకూల, ఆచరణాత్మక, నిర్మాణాత్మక' అని పేర్కొంది. కానీ, ఆ తర్వాతే చైనా ఇలా దొంగలాగా బలగాలను సరిహద్దు వెంబడి తరలించడం మరోసారి ఉద్రిక్తలకు కారణయ్యేలా ఉంది. కాగా, చైనా బలగాల కదలికలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. కయ్యానికి కాలు దువ్వితే తగిన గుణపాఠం చెప్పేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి.