ఢిల్లీ ఎయిమ్స్కు లాలూ ప్రసాద్ యాదవ్.. మరింత క్షీణించడంతో..
ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ఢిల్లీలో గల ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన రాంచీలో గల రిమ్స్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
లాలూకు రెండు రోజుల నుంచి ఊపిరి సంబంధిత సమస్యలు వచ్చినట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయనకు న్యూమోనియా వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆయనకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్కు ఆయనను తరలిస్తున్నామని నిర్ణయించామని చెప్పారు.
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో గురువారం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. లాలూ ప్రసాద్ ఆరోగ్యం గురించి ఎయిమ్స్లోని ఊపిరితిత్తుల విభాగ అధిపతిని సంప్రదించామని రిమ్స్ వైద్యులు తెలిపారు. ఆ మేరకు ఢిల్లీ తరలించి.. చికిత్స అందించనున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ మూత్ర పిండాలు 25 శాతం సామర్థ్యంతో మాత్రమే పని చేస్తున్నాయి. అందుకోసమే ఢిల్లీ ఎయిమ్స్లో నిపుణుల సమక్షంలో చికిత్స అందించబోతున్నారు. అయితే కిడ్నీల పరిస్థితి విషమించే అవకాశం ఉందని డాక్టర్ ఉమేశ్ అప్పుడే తెలిపారు. డయాలసిస్ కంటిన్యూ చేస్తారా.. అతని శరీరం సహకరిస్తోందా అనే అంశాలను వైద్యులు పరిశీలిస్తారు.