సాధ్వి వ్యాఖ్యలపై మోడీ, తగ్గని విపక్షాలు, కురియన్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యల పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజ్యసభలో వివరణ ఇచ్చారు. నిరంజన్ జ్యోతి క్షమాపణలు చెప్పినా ఆందోళన కొనసాగించడం సరికాదని మోడీ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆమె క్షమాపణలు చెప్పారని, ఉభయ సభలనూ ఆమె క్షమాపణలు కోరారని, క్షమాపణలు చెప్పినా సభను అడ్డుకోవడం సరికాదన్నారు.
సాధ్వి వ్యాఖ్యలపై విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో రాజ్యసభకు వచ్చిన మోడీ ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేశారు. దీనిపై మరింత రాద్ధాంతం చేయడం సబబు కాదన్నారు. మంత్రి క్షమాపణను పరిగణలోకి తీసుకోవాలని సభ్యులను కోరారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలన్నారు. మంత్రి వ్యాఖ్యలు మనందరికీ ఒ గుణపాఠం అన్నారు. మన భాష హుందాగా ఉండాలని చెప్పారు. ప్రజాప్రతినిధుల భాషలో సంయమనం ఉండాలన్నారు.
అయినా శాంతించని విపక్షాలపై రాజ్యసభ ఉపాధ్యక్షులు కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు సాధ్వి రాజీనామాకు పట్టుబట్టిన విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో.. సాధ్వి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
మోడీ వచ్చి వివరణ ఇచ్చి వెళ్లాక... ప్రధాని వచ్చి వివరణ ఇచ్చాక సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని వెంకయ్య కోరారు. మూడు రోజులుగా సభా కార్యక్రమాలు జరగడం లేదన్నారు. ప్రధాని ప్రకటనను సభ్యులు స్వాగతించాలన్నారు. మనది పెద్దల సభ అన్నారు.
దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు స్పందిస్తూ.. నిరంజన్ జ్యోతి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సమయంలో ఉపాధ్యక్షులు కురియన్ సభ్యులకు నచ్చ చెప్పేందుకు పలుమార్లు ప్రయత్నించారు. వారు వినలేదు. సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. క్షమాపణ అంటే తప్పు అంగీకరించినట్లేనని, దానికి రాజీనామా చేయాలన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ.. మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి రాజీనామా పైన తమ వైఖరి మారదని చెప్పారు. సభ్యుల గందరగోళం మధ్య సభను వాయిదా వేశారు.