భారత్ లో కరోనా తాజా పరిస్థితి ఇదే : 5లక్షల యాక్టివ్ కేసులు, 4లక్షలు దాటిన మరణాలు
భారతదేశంలో కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం క్షీణత దిశగానే కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు భారతదేశంలో నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇక తాజాగా గత 24 గంటల్లో భారతదేశంలో 46,617 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదు రోజుల నుండి 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

గణనీయంగా తగ్గుతున్న క్రియాశీల కేసులు
భారత దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా సోకిన బాధితుల సంఖ్య 3,04,58,251కు చేరింది.గత 24 గంటల్లో భారతదేశంలో 853 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 4,00,312 మంది కోవిడ్ -19 మహమ్మారికి బలైపోయారు. దేశంలో క్రియాశీల కేసులు కూడా బాగానే తగ్గుతున్నాయి.ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 509,637 కు చేరుకుంది. దేశంలో రికవరీలు వరుసగా కొత్త కేసుల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వరుసగా 50 రోజులుగా రోజువారీ కేసులు కంటే ఎక్కువ రికవరీలు నమోదు కావడం దేశానికి కాస్త ఊరట నిస్తుంది.

రికవరీ రేటు 96.97% .. అయినాసరే బీ అలెర్ట్ అంటున్న సర్కార్
గత 24 గంటల్లో 59,384 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో జాతీయ రికవరీ రేటు 96.97% కి చేరుకుంది.తగ్గుతున్న కేసులు, కేంద్రం మరియు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నిరంతర ప్రయత్నాల ఫలితమని, కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడానికి నిత్యం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిందే నని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో అత్యంత భయంకరంగా విలయతాండవం చేసిన కరోనా సెకండ్ వేవ్ నుండి మరణించిన వారి సంఖ్య అధికారిక సంఖ్యలో సూచించిన దానికంటే చాలా ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.

గత నాలుగు నెలల్లో 60% కంటే ఎక్కువ మరణాలు
మహమ్మారి దేశంలో ఒక సంవత్సరానికి పైగా ఉన్నప్పటికీ, నివేదించబడిన మొత్తం మరణాలలో 60% కంటే ఎక్కువ గత నాలుగు నెలల్లోనే నమోదయ్యాయి . ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, ప్రజలు కోవిడ్ -19 భద్రతా ప్రోటోకాల్లను అనుసరిస్తే, కోవిడ్ -19 యొక్క మూడవ వేవ్ ని నియంత్రించవచ్చని, ఇదే సమయంలో ఎక్కువమంది జనాభాకు టీకాలు వేయడం వల్ల కూడా థర్డ్ వేవ్ ను కంట్రోల్ చేయొచ్చని చెప్పారు.

థర్డ్ వేవ్ తీవ్రత తగ్గే ఛాన్స్ .. అయితే జాగ్రత్తలే శ్రీరామ రక్ష
జాగ్రత్తలు పాటిస్తే, వ్యాక్సిన్ తీసుకుంటే థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని, అది ప్రజల మీద, ప్రభుత్వాల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ గులేరియా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కరోనా మహమ్మారి పూర్తిగా అంతం కాలేదు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications