కొందరు జడ్జీలు యాంటీ-ఇండియా గ్యాంగ్ లో భాగం ! న్యాయమంత్రి కిరణ్ రిజిజు సంచలన కామెంట్స్..
ఢిల్లీ : దేశంలో కేంద్ర ప్రభుత్వానికీ, న్యాయవ్యవస్ధకూ మధ్య నెలకొన్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే న్యాయ నియామకాల విషయంలో సుప్రీంకోర్టు, కొలీజియం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడుతున్న కేంద్రం.. ఇవాళ తీవ్ర విమర్శలకు దిగింది. అదీ న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు న్యాయమూర్తులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిలో కొందరు భారత్ వ్యతిరేక గ్యాంగ్ లో భాగమన్నారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన ఇండియా టుడే సదస్సులో న్యాయశాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా న్యాయమూర్తుల జవాబుదారీతనంపై ఓ సెమినార్ జరిగిందని, అయితే కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో ఇందులో రుజువైందని న్యాయశాఖమంత్రి కిరణ్ రిజిజు ఇవాళ వ్యాఖ్యానించారు. కొంతమంది న్యాయమూర్తులు.. రాజకీయ కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీల మాదిరిగా న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న భారత వ్యతిరేక ముఠాలో భాగమయ్యారంటూ రిజిజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లి దయచేసి ఈ ప్రభుత్వాన్నిపాలించాలని కోరుతున్నారని, ఇది ఎప్పటికీ జరగదన్నారు. న్యాయవ్యవస్థ తటస్థంగా ఉంటుందని, న్యాయమూర్తులు ఏ గ్రూపులు లేదా రాజకీయ పార్టీల్లో భాగం కాదన్నారు. భారత న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి దీటుగా ఉండాలని కొందరు వ్యక్తులు బహిరంగంగా ఎలా చెప్తారని రిజిజు ప్రశ్నించారు.

భారత న్యాయవ్యవస్థ హైజాక్ అయిందని, లేదా దేశంలో ప్రజాస్వామ్యం ముగిసిందని రాహుల్ గాంధీ లేదా ఎవరైనా చెబితే.. దాని అర్థం ఏమిటని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. భారత న్యాయవ్యవస్థను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందుకే భారత న్యాయవ్యవస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని వారు ప్రచారం చేస్తున్నారని న్యాయమంత్రి మండిపడ్డారు. దేశంలో సంస్థల మధ్య రాజ్యాంగబద్ధమైన "లక్ష్మణ రేఖ"ను గుర్తుచేస్తూ న్యాయమూర్తులు పరిపాలనా నియామకాలలో భాగమైతే, న్యాయపరమైన వ్యవహారాల్ని ఎవరు నిర్వహిస్తారని రిజిజు ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు మార్చి 2న ఇచ్చిన నిర్ణయంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications