మోడీ! జైట్లీతో జాగ్రత్త, మీకు ఓట్లు వద్దా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయరని, ఆయనను వదిలించుకోకుంటే మీకు కష్టమేనని, ఆయనను వదిలించుకోండని ప్రధాని నరేంద్ర మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హితవు పలికారు.
వెండి మినహా ఇతర ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం విధింపు వివాదంలో ఏఏపీ, బిజెపిల మధ్య పరస్పర ఆరోపణల పర్వం కొనసాగుతోంది. నగల వర్తకుల మద్దతు కోల్పోవద్దు అనుకుంటే తక్షణమే ఆర్థికమంత్రి జైట్లీని వదిలించుకోవాలని కేజ్రీవాల్ ప్రధానికి సూచించారు.
వెండి మినహా ఇతర ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలంటూ బంగారం వర్తకులు, నగల దుకాణాల యజమానులు, నగల తయారీదారులు మార్చి రెండో తేది నుంచి సమ్మె చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన సభలో నగలదుకాణాదారులను ఉద్దేశించి కేజ్రీవాల్ ఆదివారం ప్రసంగించారు.
బిజెపి అంటే వర్తకుల అనుకూల పార్టీ అనే భావన ఉందని, కానీ ఇప్పుడేమైందని ప్రశ్నించారు. జైట్లీ ఎలాగూ ఎన్నికల్లో పోటీ చేయరని, మీకు మాత్రం ఓట్ల ఆవశ్యకత ఉంటుందని, అందుకే ఆయనతో జాగ్రత్తగా ఉండాలని, నగల వర్తకులను మోసం చేస్తే వాళ్లు మీ పక్షాన ఉండరు జాగ్రత్త అని కేజ్రీవాల్.. మోడీని ఉద్దేశించి అన్నారు. దయచేసి జైట్లీ పక్షాన్ని వదిలేయండని, లేదంటే ఆయన మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తారన్నాడు.