‘ఎల్కె అద్వానీ కనబడుట లేదు’: ‘ఆప్’ పేరున వెలిసిన పోస్టర్లు
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎంపి ఎల్కె అద్వానీ ‘కనబడుట లేదు' అనే వాల్ పోస్టర్లు ఆయన నియోజకవర్గమైన గాంధీనగర్లో ఎక్కడా చూసినా దర్శనమిస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, అమేథీ ఎంపి రాహుల్ గాంధీ విషయంలో ఆయన సొంత నియోజకవర్గం అమేథీలో జరిగినట్లుగానే అద్వానీ నియోజకవర్గంలో కూడా జరిగింది.
విద్యుత్ సంస్తంభాలు, గోడలపై అంటించిన వాల్ పోస్టర్లపై ఆమ్ ఆద్మీ పార్టీ పేరు ఉండటం గమనార్హం. ‘అద్వానీ గత కొన్నేళ్లుగా కనబడటం లేదు. గాంధీనరగ్ వాసుల్లో ఎవరూ ఆయనను నగరంలో చూడనే లేదు. గాంధీనగర్లో చూస్తే మాకు తెలపండి. గౌరవ వందనాలు, ఇట్లు మీ ఆమ్ ఆద్మీ పార్టీ-గాంధీనగర్' అనే పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి.

కాగా, ఆ వాల్ పోస్టర్లతో తమకేలాంటి సంబంధం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. బిజెపిలోని అద్వానీ వ్యతిరేక వర్గమే ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని గుజరాత్ విభాగం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ సుఖ్దేవ్ పటేల్ చెప్పారు.
ఇది ఇలా ఉండగా, గాంధీనగర్ ఎంపి అయిన అద్వానీ ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారనీ.. కొన్ని వారాల క్రితమే గాంధీనగర్కు వెళ్లారని గుజరాత్ విభాగం బిజెపి మీడియా కన్వీనర్ హర్షద్ పటేల్ తెలిపారు. అంతేగాక, గాంధీనగర్లో పలు అభివృద్ధి పనులను సమీక్షించారని వెల్లడించారు. బిజెపికి చెందిన నేతలెవరూ కూడా ఇలాంటి పోస్టర్లు వేయరని చెప్పారు. కాగా, గాంధీనగర్ నుంచి అద్వానీ ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications