ఎన్నిక: అద్వానీకి పాదాభివందనం, మోడీ వల్లేనని...
న్యూఢిల్లీ: బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగింది. ఈ సమావేశంలో మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నికున్నారు. సమావేశానికి హాజరైన కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు మెట్లకు నమస్కరించి లోపలకు వెళ్లారు. సమావేశంలో పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ సభా నాయకుడిగా మోడీ పేరును ప్రతిపాదించారు. అద్వానీ ప్రతిపాదనను మురళీ మనోహర్ జోషీ, వెంకయ్యనాయుడులు సమర్థించారు.
సెంట్రల్ హాలులో జరిగిన సమావేశాన్ని బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. మోడీ పేరును అద్వానీ ప్రధానిగా ప్రతిపాదించగా పలువురు నేతలు సమర్థించారు. మురళీ మనోహర్ జోషీ, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితరులు అద్వానీ ప్రతిపాదనను సమర్థించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్... మోడీని సభా నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించగానే హాలులో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. సభా నాయకుడిగా ఎన్నికైన తర్వాత ఆద్వానీకి మోడీ పాదాభివందనం చేశారు.
ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ.. ప్రధాని ఎవరో ప్రజలు ముందే నిర్ణయించారన్నారు. దేశ ప్రియతమ నేత మోడీ అని వెంకయ్య నాయుడు చెప్పారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... ఈ రోజు చారిత్రాత్మకమైనదన్నారు. స్వాతంత్రానంతరం కాంగ్రెసు పార్టీ తర్వాత బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. స్వావలంబన, ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాభివృద్ధే లక్ష్యమని చెప్పారు.
దేశ చరిత్రలో అత్యధికంగా ఓటు నమోదు కావడం ఇదే ప్రథమమన్నారు. ఈ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింద్నారు. సుపరిపాలనే మా ప్రధాన అజెండా అనే నినాదంతో వెళ్తామన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ గోవా తదితర రాష్ట్రాల్లో ఎక్కువ స్తానాలు సాధించామన్నారు. పది రాష్ట్రాల్లో బిజెపి సంపూర్ణ విజయం సాధించిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఆర్థిక వ్యవస్థ చతికిలపడిందని, మోడీ నేతృత్వంలో నిలబెడతామని చెప్పారు.
మోడీ వల్లే: అద్వానీ
ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని చారిత్రాత్మక ఘట్టాలు, పరిణామాలు ఉంటాయని అద్వానీ చెప్పారు. నేటి తన ప్రసంగం తన జీవితంలో ఆ కోవలోకే చెందుతుందని చెప్పారు. మోడీ ప్రభంజనం వల్లనే బిజెపి ఈ భారీ విజయం సాధించిందని చెప్పారు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు అంత ఆనందం ఉందని అద్వానీ చెప్పారు. మోడీ ప్రభంజనం వల్లే బిజెపి ఈ విజయం సాధించిందని, ఈ ఘన విజయం ఆయనకే దక్కుతుందన్నారు.
26న మోడీ ప్రమాణం?
ఈ నెల 26వ తేదీన మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.