సింఘు బోర్డర్ వద్ద హైటెన్షన్.. రైతులపై రాళ్లు రువ్విన స్థానికులు,టెంట్లు ధ్వంసం.. పోలీసుల లాఠీచార్జి..
ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘు వద్ద రైతుల నిరసన ప్రదేశంలో శుక్రవారం(జనవరి 29) ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న స్థానికుల గుంపు రైతులపై రాళ్లు రువ్వింది. రైతులు వేసుకున్న టెంట్లను ధ్వంసం చేసింది. తక్షణమే రైతులు సింఘు బోర్డర్ను ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు రైతులు అక్కడినుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు.పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. వారిపై టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు,టిక్రీ,ఘాజీపూర్ ప్రదేశాల్లో రైతులను ఖాళీ చేయించేందుకు ఓవైపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగానే... మరోవైపు స్థానికుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. గురువారం(జనవరి 28) కూడా స్థానికులు రోడ్డెక్కి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని.. 'సింఘు బోర్డర్ను ఖాళీ చేయండి..' అంటూ రైతులను ఉద్దేశించి నినాదాలు చేశారు. దాదాపు రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలతో తన వ్యాపారం బాగా దెబ్బతిన్నదని నిరసనలో పాల్గొన్న స్థానికుడు ఒకరు తెలిపారు. మరో వ్యక్తి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండా ఎగరవేయడాన్ని తప్పు పట్టారు. అది జాతీయ జెండాను అవమానించడమేనని... ఆ చర్యను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగామని చెప్పారు.
కాగా,రిపబ్లిక్ డే రోజు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని రైతులు భావించగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో రైతు ఉద్యమం అదుపు తప్పిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారిని ఢిల్లీ సరిహద్దుల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తుండగా... రైతులు మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకూ తాము ఢిల్లీ బోర్డర్స్ను వీడేది లేదని తెగేసి చెబుతున్నారు.
ఇదే విషయంపై బీకేయూ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ మాట్లాడుతూ... బీజేపీ తమను చంపేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ-యూపీ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద వేలాదిగా పోలీసులను మోహరించి రైతులను ఖాళీ చేయించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆయన తప్పు పట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము నిరసన ప్రదేశాలను వీడమని అన్నారు. అంతకుముందు బీకేయూ ఇచ్చిన పిలుపుతో యూపీ నుంచి మరింతమంది రైతులు ఘాజీపూర్ బోర్డర్కు చేరుకున్నారు.