కేరళలో లాక్డౌన్ పొడిగింపు, మే23దాకా -సీఎం విజయన్ వెల్లడి -ఇవాళ 93 మరణాలు, కొత్తగా 34,694కేసులు
కరోనా కొత్త కేసులు, మరణాల్లో దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీగా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళలోనూ వైరస్ వీరవిహారం చేస్తున్నది. కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో కేరళలో లాక్డౌన్ను మరో వారం రోజులు పొడిగించారు.
ఇప్పటికే మే 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉండగా, ప్రస్తుత పరిస్థితిని అంచనావేసి, అయినా జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇంకా తగ్గకపోవడంతో లాక్డౌన్ను మరో వారంపాటు పొడిగించాలని సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మే 23 వరకు లాక్డౌన్ కొనసాగనుంది.

కేరళలో వైరస్ ఉధృతి కొనసాగుతోందనడానికి నిదర్శనంగా శుక్రవారం కూడా భారీ ఎత్తున కేసులు, మరణాలు నమోదయ్యాయి. కేరళ వైద్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 34,694 కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 20,85,584కు, మొత్తం మరణాలు 6243కు పెరిగాయి. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 26.41గా కొనసాగుతున్నది.












Click it and Unblock the Notifications