కీలక బిల్లుల వేళ ఎంపీలకు కీలక మార్గదర్శకాలు..!!
ఈ సారి పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేకత ఉంది. కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. అందులో భాగంగా కావాల్సిన మెజార్టీ లెక్కలను సిద్దం చేస్తోంది. దేశ రాజకీయ ముఖచిత్రం మార్చే బిల్లులు కావటంతో.. రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సమయంలోనే సమావేశాల ప్రారంభ వేళ ఎంపీలకు లోక్సభ సచివాలయం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఈ సూచనలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 17వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి సమావేశాల్లో ప్రతిష్ఠాత్మక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. ఇందు కోసం అవసరమైన మెజార్టీని సిద్దం చేసుకుంటోంది. ఊహించని రాజకీయ లెక్కలకు ఈ సారి పార్లమెంట్ వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో లోక్సభ సచివాలయం ఎంపీల కోసం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ అధికారిక బులిటెన్ విడుదల చేసింది.

సభలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు పార్లమెంటు అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేయడంపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా.. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలపై సచివాలయం పూర్తిస్థాయి ఆంక్షలు విధించింది. సభా రికార్డులకు భిన్నంగా రహస్యంగా చిత్రాలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం వంటి అనధికారిక చర్యలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
కాగా.. డిజిటల్ భద్రతా ప్రమాణాల దృష్ట్యా సభలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఈ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు సభలోకి స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల వంటి ఎలాంటి నిఘా ఆధారిత గ్యాడ్జెట్లనూ తీసుకురావద్దని స్పష్టం చేసారు. దీంతో పాటుగా.. సభ్యులు సాధారణంగా నిర్వహించే నిరసనల పైన స్పష్టత ఇచ్చింది.
ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, రాజకీయ నిరసనలు చేపట్టడంపై పూర్తి నిషేధం విధించారు. అలాగే సభా సమయాన్ని, వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్లకార్డులు ప్రదర్శించడం, ఆయుధాలు తీసుకురావడం వంటి చర్యలను ఇక అనుమతించరని స్పష్టం చేసారు. పార్లమెంటు పరిధిలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేదా పూజలు నిర్వహించకూడదని స్పష్టం చేస్తూ, సభా మర్యాదలను, శాంతిభద్రతలను కాపాడేందుకు ఎంపీలందరూ సహకరించాలని లోక్సభ సచివాలయం సూచించింది.














Click it and Unblock the Notifications