వన్ స్ట్రైక్..ఆన్ స్ట్రైక్: పాకిస్తాన్, చైనాలకు జాయింట్గా షాకిచ్చిన భారత్: సైనిక్ స్కూల్ స్టూడెంట్
న్యూఢిల్లీ: తరచూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమౌతోన్న పాకిస్తాన్, చైనాలకు భారత్ జాయింట్గా షాకిచ్చింది. అటు లఢక్ వైపు వాస్తవాధీన రేఖ, ఇటు జమ్మూ కాశ్మీర్ వైపు నియంత్రణ రేఖల వద్ద చొరబాట్లు, ఆక్రమణలకు పాల్పడుతూ వస్తోన్న ఆ రెండు దేశాలకు భారత ఆర్మీ అధికారులు వేసిన కొత్త ఎత్తుగడ ఊహకు కూడా అందనిదే. చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఆపరేషన్ను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వన్ స్ట్రైక్ కార్ప్స్కు కొత్త కమాండర్ను నియమించారు ఆర్మీ అధికారులు. ఇదివరకు పని చేసిన కమాండర్ను బదిలీ చేశారు.
స్ట్రైక్ వన్ కార్ప్స్ కొత్త కమాండర్గా లెప్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్మీ అధికారులు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. మనోజ్ కుమార్ కతియార్.. రాజ్పుత్ రెజిమెంట్ 23వ బెటాలియన్ కమాండర్గా పనిచేశారు. అంతర్జాతీయ వ్యవహారాలు, సరిహద్దు వివాదాలు, భౌగోళిక పరిస్థితులపై సమగ్రమైన అవగాహన, పట్టు ఉండటం వల్ల కతియార్ను కీలకమైన వన్ స్ట్రైక్ కార్ప్స్ కమాండర్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
మనోజ్ కుమార్ కతియార్ సైనిక్ స్కూల్ విద్యార్థి. ఉత్తరాఖండ్లోని గోరఖల్లో గల సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాదికాలంగా చోటుచేసుకుంటోన్న పరిణామాలను ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, గాల్వన్ వ్యాలీ మొదలుకుని ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకు మూడువేల కిలోమీటర్లకు పైగా పొడవున్న చైనా సరిహద్దులు, భౌగోళిక పరిస్థితులు, అక్కడి వాతావరణం, సైనిక మోహరింపు వంటి అంశాలపై ఆయనకు గట్టిపట్టు ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.