దంపతుల మధ్య చిచ్చు రేపిన ట్రాఫిక్ ‘గులాబీ’ పువ్వు: ఆ భర్త తంటాలు అన్నీఇన్నీకావు!
లక్నో: నిబంధనలను ఉల్లంఘించిన వారిని శిక్షించడమూ తెలుసు.. నిబంధనలను తూ.చ తప్పకుండా వారిని అభినందించడమూ తెలుసంటూ ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు ఓ కొత్త కార్యక్రమాన్ని ముందుకు తెచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిబంధనలను పాటించే వారికి గులాబీ పువ్వు ఇచ్చి వారిని గౌరవిస్తారు. అయితే, ఇలా ఇచ్చిన గులాబీ లక్నోకు చెందిన ఓ దంపతుల మధ్య పెను దుమారాన్ని సృష్టించింది.
గులాబీ ఇచ్చిన పోలీసులు
వివరాల్లోకి వెళితే.. లక్నో నగరంలోని సికందర్బాగ్ కూడలి వద్ద హెల్మెట్ పెట్టుకున్న ఓ బైకర్కు రోజా అందించారు పోలీసులు. ఆ గులాబీ తీసుకొని ఆ వ్యక్తి నేరుగా అతడి ఇంటికెళ్లగా భార్య నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.
గులాబీ తెచ్చిన వివాదం
ఈ గులాబీ ఎవరిచ్చారంటూ భార్య అతడ్ని నిలదీసింది. సదరు వ్యక్తికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ట్రాఫిక్ పోలీసులే ఆ గులాబీ ఇచ్చినట్లు వివరించాడు. కానీ, అతడి భార్య అవన్నీ కట్టుకథలని కొట్టిపారేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్రమైన వాగ్వివాదానికి దారి తీసింది.
నిజాయితీని నిరూపించుకునేందుకు..
తన భార్యకు తన నిజాయతీ చూపించుకోడానికి అతగాడు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాను గులాబీ తీసుకున్న కూడలి వద్దకు వెళ్లి ట్రాఫిక్ పోలీసుల గురించి వెతికాడు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో నేరుగా సికందర్బాగ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కే వెళ్లాడు.
ఎస్ఐని కలిసిన వ్యక్తి.. ధీమాగా వెళ్లాడు
చివరకు ట్రాఫిక్ ఎస్సైని కలిసి ఆ వ్యక్తి జరిగిన వివాదం గురించి వివరించాడు. దీంతో ఆయన తమ క్యాంపెయిన్కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇచ్చి పంపించారు. దీంతో సదరు వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ఇంటిముఖం పట్టాడు. అతని కుటుంబంలో శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నట్లు సదరు పోలీసు అధికారి ఆకాంక్షించారు. ఈ వింత ఘటన గురించి వివరిస్తూ ఆ ఎస్సై తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టడటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.