భవిష్యత్ లో జిల్లా ఆస్పత్రుల్లో AI ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలు.. ప్రకటించిన మంత్రి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వైద్యుల సామర్థ్యాన్ని మరింత పెంచి, ప్రజల ప్రాణాలను కాపాడే శక్తివంతమైన సాధనంగా మారుతుందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఆస్పత్రులలో ఏఐ వినియోగం కోసం తీసుకుంటున్న అనేక కీలక నిర్ణయాలను వెల్లడించారు.
ప్రపంచం వైద్య చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన మార్పు దశలో ఉందన్న మంత్రి
హైదరాబాద్ హైటెక్ సిటీలో "AI in Healthcare 2.0 - Powering Precision & Personalizing Care" అంతర్జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ఈ విషయాలను వెల్లడించారు.మంత్రి మాట్లాడుతూ, ప్రపంచం వైద్య చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన మార్పు దశలో ఉందని పేర్కొన్నారు. గతంలో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడంపై దృష్టి సారించేవారన్నారు. కానీ ఏఐ దానిని మార్చేసిందన్నారు.

రాబోయే రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో కూడా AI ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలు
ఇప్పుడు కృత్రిమ మేధస్సు, జీనోమిక్స్, డిజిటల్ హెల్త్ సాంకేతికతల సాయంతో వ్యాధులను ముందుగానే గుర్తించి, నివారించి, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా అనువైన చికిత్స అందించే యుగం వచ్చిందని వివరించారు.రాబోయే రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో కూడా AI ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలను విస్తృతంగా అమలు చేసి, నిపుణుల వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా అత్యున్నత స్థాయి వైద్య సేవలను ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.
ఆస్పత్రులలో ఇప్పటికే ఈ సాంకేతికతలు
ఎక్స్రే చిత్రాల AI విశ్లేషణ, సెప్సిస్ ముందస్తు గుర్తింపు, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే సాంకేతికతలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికే ప్రవేశపెడుతున్నామని తెలిపారు. కృత్రిమ మేధస్సు ఎంత అద్భుతమైనదైనా, అది వైద్యులను భర్తీ చేయదని, వారి సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక స్థితి ఏమైనా ప్రతి పౌరుడికి నాణ్యమైన, వేగవంతమైన, సరసమైన వైద్య సేవలు అందాలన్నదే లక్ష్యమని అన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డిజిటల్ విద్యా విధానం
హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా, బయోటెక్ రంగాల్లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినట్టు, ఆరోగ్య రంగంలో AI సొల్యూషన్స్ అభివృద్ధిలో కూడా ప్రపంచ కేంద్రంగా ఎదగాలని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డిజిటల్ క్లాస్రూమ్స్, సిమ్యులేషన్ ల్యాబ్స్, హైబ్రిడ్ బోధన వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి భవిష్యత్ వైద్యులను AI యుగానికి సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రతి రోగికి వ్యక్తిగత వైద్య సేవలు అందించే దిశగా తెలంగాణ
విజన్-2047 లక్ష్యాలతో సమన్వయం చేసుకుని చికిత్స ఆధారిత వ్యవస్థ నుంచి నివారణ ఆధారిత ప్రజారోగ్య వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. AI, జీనోమిక్స్, ప్రిసిషన్ మెడిసిన్ ద్వారా ప్రతి రోగికి వ్యక్తిగత వైద్య సేవలు అందించే దిశగా తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో స్టార్టప్లు, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు, మానవీయ విలువలు, వైద్యుల అనుభవం, రోగి సేవాభావం ఎప్పటికీ అనివార్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications