US-Iran War: గల్ఫ్ దాటి అమెరికాపై దాడులు ? యూరప్ లో ఇరాన్ భారీ ప్లాన్..!
ఈ ఏడాది ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభించి ఆరు నెలలు దాటిపోయింది. అయినా ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియడం లేదు. మధ్యలో కాసేపు విరామాలు ఇవ్వడం, తిరిగి దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తూ అమెరికా చూపిస్తున్న దూకుడు.. ఇరాన్ (Iran)కు మంటపుట్టిస్తోంది. దీంతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లపై చేస్తున్న దాడుల్ని యూరప్ కు విస్తరించేందుకు ఇరాన్ సిద్దమవుతోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనం ప్రచురించింది.
హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తూ అమెరికా రెచ్చగొడుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ఆ దేశ ఎయిర్ బేస్ లపై జరుపుతున్న దాడుల్ని యూరప్ లోని బేస్ లకు సైతం విస్తరించారని ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ ఈ విషయం తెలిపింది. బల్గేరియా, సైప్రస్తో సహా ఆగ్నేయ యూరప్లోని అమెరికా ఆస్తులపై దాడులు చేసేందుకు గల అవకాశాలను ఇరాన్ బలగాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా విమానాలకు ఇంధనం నింపడానికి తన బెజ్మెర్ వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి బల్గేరియా తాజాగా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బల్గేరియాలోని అమెరికా సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది.

దీంతో పాటు మరో దేశం సైప్రస్ను కూడా టార్గెట్ చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ ద్వీపంలో ఒక బ్రిటిష్ సైనిక స్థావరం ఉంది. దానిపై మార్చిలో ఇప్పటికే ఓ డ్రోన్ దాడి జరిగింది. ఇప్పుడు అమెరికాతో వార్ మరింత ముదిరితే.. హార్ముజ్ జలసంధిలోని సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లపై దాడి చేసే అవకాశాన్ని కూడా ఇరాన్ దళాలు పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు కూడా నిలిచిపోయిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా చర్చలు జరిపేందుకు కూడా ఇరు దేశాలూ ఇష్టపడటం లేదు. దీంతో దాడుల విస్తరణ ఒకటే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications