సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ.. గూగుల్ క్లౌడ్తో ఏఐ టాస్క్ ఫోర్స్
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, సంపద సృష్టి, ఉద్యోగ కల్పన లక్ష్యాలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సింగపూర్ పర్యటన తొలిరోజే సూపర్ సక్సెస్ అయింది. మౌలిక సదుపాయాలు, విద్యా రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ వంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు చేస్తూ వరుస సమావేశాల్లో పాల్గొన్నారు.
1. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో ఆయన అధికారిక నివాసంలో దాదాపు 30 నిమిషాల పాటు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణ పురోగతి, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న మౌలిక వసతుల గురించి సింగపూర్ ప్రధానికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్, క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, అర్బన్ గవర్నెన్స్లో ఏపీకి సాంకేతిక తోడ్పాటు అందించాలని కోరారు. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని వివరించడంతో పాటు, రాష్ట్రంలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల, శిశు సంరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.

2. హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశం
పర్యటన ప్రారంభంలో సింగపూర్లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, షిప్ బిల్డింగ్ - సివిల్ ఏవియేషన్లో ఎంఆర్వో (MRO) కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను సీఎం వివరించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ప్రపంచ స్థాయి నాణ్యత గల ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం పెట్టుబడులకు సిద్ధంగా ఉందని సీఎం పేర్కొనగా, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ రంగాల్లో ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని అంబులే హామీ ఇచ్చారు.
3. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ సమావేశం
సింగపూర్ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం, మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీలో 'వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్' (ఇంటికో పారిశ్రామికవేత్త) అనే వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ద్వారా అమరావతిని నిర్మిస్తున్నామని, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలకు వేగంగా అనుమతులిచ్చామని గుర్తుచేశారు. శ్రీసిటీ లాంటి పారిశ్రామిక వాడలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
4. యూఎన్ హాబిటాట్ (UN-Habitat) ప్రతినిధులతో భేటీ
పట్టణాల సుస్థిర అభివృద్ధి కోసం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్బాక్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 'యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుకు ఉచితంగా భూమి కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తీరప్రాంత నగరాలను వాతావరణ మార్పుల నుంచి రక్షించే 'రైజప్' (Rise Up) కార్యక్రమాన్ని, మురికివాడల అభివృద్ధి కోసం 'పార్టిసిపేటరీ స్లమ్ అప్గ్రేడింగ్ ప్రోగ్రామ్' (PSUP)ను ఏపీలో అమలు చేయాలని ప్రతిపాదించారు. 2028 నాటికి ఈ లక్ష్యాలను చేరుకునేలా స్పష్టమైన టైమ్లైన్తో కూడిన ఎంవోయూ (MoU) చేసుకోవాలని నిర్ణయించారు.
5. YCH లాజిస్టిక్స్ గ్రూప్తో చర్చలు
భారీ సప్లై చైన్ - లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై YCH లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ సునీల్ నంబియార్తో సీఎం భేటీ అయ్యారు. ఏపీకి ఉన్న 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం, హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టుల కనెక్టివిటీ లాజిస్టిక్స్ రంగానికి ఒక వరం అని సీఎం పేర్కొన్నారు. హార్టికల్చర్పై రూ. 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నామని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించేందుకు భాగస్వాములు కావాలని YCH గ్రూప్ను ఆహ్వానించారు.
6. గూగుల్ క్లౌడ్తో ఏఐ (AI) టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో జరిగిన భేటీలో ఏపీని దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్ హబ్గా మార్చే అంశంపై చర్చించారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG)ని మరింత బలోపేతం చేయడం, వర్సిటీలలో ఏఐ స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, - ప్రభుత్వ 'సంజీవని' ప్రాజెక్టులో గూగుల్ భాగస్వామ్యంపై సీఎం చర్చించారు.
7. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS)తో విద్యా భాగస్వామ్యం
ప్రపంచ ప్రఖ్యాత నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ ఎంగ్ చేయ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో ఎన్యూఎస్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. అమరావతి 'క్వాంటం వ్యాలీ'లో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సాంకేతిక సాయం అందించాలని, గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే సరికొత్త పాలసీల రూపకల్పనలో ఎన్యూఎస్ పాలసీ ఇనిస్టిట్యూట్ సహకరించాలని కోరారు. గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో తమకున్న భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్న ప్రొఫెసర్లు, క్యాంపస్ ఏర్పాటుపై సానుకూలంగా చర్చిస్తామని హామీ ఇచ్చారు.














Click it and Unblock the Notifications