Madhya Pradesh polls: మధ్యప్రదేశ్ లో ఆ 18 సీట్లపైనే అందరి గురి-కేంద్రమంత్రుల్ని దింపిన బీజేపీ..
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ కు చావోరేవోగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరీగా ఎన్నికలు సాగే అవకాశం ఉంది. అయితే ఇందులో 18 సీట్లలో ఈ పోరు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు నేపథ్యంలో ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించిన సీట్లతో పాటు మరికొన్ని ఉన్నాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న పోటాపోటీ నియోజకవర్గాల్లో దిమాని, గ్వాలియర్, శివ్ పురి, రాఘోఘర్, చచౌరా, జబువా, ఇండోర్ 1, రౌ, సన్వేర్, హర్సూద్, బుధానీ, లాహర్, దతియా, నర్సింఘ్ పూర్, చింద్వారా, నివాస్, సత్నా, సిధీ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఈసారి హోరాహోరీ పోరు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో బుధానీలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా నాలుగుసార్లు గెలిచారు. మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు.

అలాగే 2019లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ సీఎం కమల్ నాథ్ గెలిచిన చింధ్వారా సీటు కూడా ఒకటి. మరోసారి ఇక్కడి నుంచి గెలిస్తే కమల్ నాథ్ సీఎం అయ్యే అవకాశం ఉండటంతో ఈ నియోజకవర్గంపై అందరిదృష్టీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా కమల్ నాథ్ ను ఓడించేందుకు బీజేపీ అన్ని ఎత్తులూ వేస్తోంది. సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో 2020లో ఉపఎన్నిక జరిగి తిరిగి కాంగ్రెస్ గెల్చుకున్న సీటు దిమానీ. ఇందులోనూ ఈసారి కాంగ్రెస్, బీజేపీ పోరు తప్పేలా లేదు. ఇక్కడ గెలిచేందుకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను బీజేపీ బరిలోకి దింపుతోంది.
అలాగే మరో కేంద్రమంత్రి ప్లహాద్ సింగ్ పటేల్ ను నర్సింఘాపూర్ లో బీజేపీ బరిలోకి దింపుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ గెల్చుకున్న ఈ సీటులో ప్రహ్లాద్ సింగ్ సోదరుడు జలం సింగ్ గెలిచారు. ఈసారి అన్న కోసం ఆయన ఈ సీటును త్యాగం చేశారు. దీంతో తొలిసారి ప్లహ్లాద్ సింగ్ బరిలో ఉన్నారు. 2018లో కాంగ్రెస్ గెలిచిన నివాస్ సీటులో ఈసారి కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తేను బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇండోర్ 1 లోనూ కాంగ్రెస్ సిట్టింగ్ సంజయ్ శుక్లాను ఓడిచేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయను ఇక్కడ బరిలోకి దింపుతోంది. అటు దాతియా సీటులో గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలిచిన ప్రస్తుత హోంమంత్రి, వివాదాస్పద నేత నరోత్తమ్ మిశ్రా మరోసారి బరిలోకి దిగుతున్నారు.












Click it and Unblock the Notifications