పులుల్ని ఇచ్చి కుక్కల్ని తీసుకుంటున్నారు: దేశ చరిత్రలోనే క్రేజీ డీల్!
భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన, భారీ అంతర్రాష్ట్ర వన్యప్రాణుల మార్పిడి కార్యక్రమానికి తెరలేచింది. దేశంలోనే అత్యధిక పులుల జనాభా కలిగిన మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో ఒక వినూత్న ఒప్పందానికి సిద్ధమవుతోంది.
ఆంధ్రా అడవుల్లో పులుల సంతతిని పెంచేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాయల్ బెంగాల్ టైగర్స్తో పాటు భారీ 'గౌర్ల'ను (భారతీయ అడవి దున్నలు) పంపించనుంది. దీనికి బదులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి అంతరించిపోతున్న అరుదైన 'ఆసియా అడవి కుక్కలను' (Dholes) మధ్యప్రదేశ్ తీసుకోబోతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన అటవీశాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఆంధ్రా అభ్యర్థన.. సీఎం మోహన్ యాదవ్ సానుకూలత!
ఆంధ్రప్రదేశ్ అడవులలో పులులు, గౌర్ల సంఖ్యను పటిష్టం చేసేందుకు తమకు కొన్ని జంతువులను ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ను కోరింది. ఈ అభ్యర్థనపై ఎంపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. ఏపీకి పులులు, గౌర్లను అందించే ప్రక్రియను ప్రారంభించాలని, అదే సమయంలో అక్కడి నుంచి అంతరించిపోతున్న వన్యప్రాణుల జాతులను, ముఖ్యంగా అడవి కుక్కలను తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అటవీశాఖను ఆదేశించారు. అయితే, ఆంధ్రా ప్రభుత్వం మొత్తం ఎన్ని పులులను కోరింది, ఏ యే టైగర్ రిజర్వ్ల నుంచి వీటిని తరలిస్తారనే వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

టైగర్ల 'సప్లై హబ్'గా మధ్యప్రదేశ్!
భారతదేశంలోనే అత్యధిక పులులు ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పులుల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంరక్షణను మెరుగుపరిచేందుకు ఎంపీ ప్రభుత్వం నిరంతరం పులులను ట్రాన్స్లొకేట్ (వేరే ప్రాంతాలకు తరలించడం) చేస్తూ వస్తోంది. గత కొన్ని నెలలుగా రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు కూడా పులుల తరలింపునకు మధ్యప్రదేశ్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలోనే జెనెటిక్ వైవిధ్యాన్ని పెంచేందుకు బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ నుంచి ఒక ఆడపులిని రాజస్థాన్లోని ముకుంద్రా టైగర్ రిజర్వ్కు విజయవంతంగా తరలించారు.
బదులుగా రాబోతున్న 'ఖరీదైన' అడవి కుక్కలు!
ఈ మార్పిడిలో మధ్యప్రదేశ్ ఆశిస్తున్న ప్రధాన వన్యప్రాణి జాతి 'ధోల్' (Dhole) లేదా ఆసియా అడవి కుక్క. శాస్త్రీయంగా 'క్యుయాన్ ఆల్పినస్' (Cuon alpinus) అని పిలిచే ఈ అడవి కుక్కలను అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (IUCN) "అంతరించిపోతున్న జాతుల" (Endangered) జాబితాలో చేర్చింది. ఇవి జీవించడానికి దట్టమైన, ఒకదానికొకటి అనుసంధానించబడిన అటవీ ప్రాంతాలు, తగినంత వేటాడే జంతువులు అవసరం.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని కాన్హా, బాంధవ్గఢ్, పెంచ్ వంటి ప్రసిద్ధ రిజర్వులలో ఇప్పటికే ఈ అడవి కుక్కల జనాభా ఉంది. వీటికి అదనంగా ఆంధ్రా అడవుల నుంచి వచ్చే కొత్త రక్తం ఇక్కడి వన్యప్రాణుల వైవిధ్యాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య జరగబోయే ఈ భారీ వైల్డ్లైఫ్ ఎక్స్ఛేంజ్ రెండు రాష్ట్రాల అటవీ పర్యావరణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయనుందని అటవీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications