ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 30 మందికి సీరియస్
మధ్య ప్రదేశ్ లో వరుసగా ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. ఇటీవల భిండ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. రేవా జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఓ ప్యాసింజర్ బస్సు- ట్రక్కు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం సెప్టెంబర్ 2 సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ హైవే 39 లో గుద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్వార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్పష్టమైంది.
ఈ ప్రమాద ఘటనతో అక్కడ భీకర వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దీంతో ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం అక్కడకు చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్స్ ను నిర్వహించింది. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించేందుకు అనేక అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది.

ఈ ఘటనపై రేవా జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ట్రక్కు- బస్సు ఢీ కొన్న తర్వాత బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిందని అన్నారు. గర్హ్ అనే ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ లో ప్రస్తుతం అందరూ నిమగ్నమై ఉన్నారని వివరించారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భావన మారావి మాట్లాడుతూ.. క్షతగాత్రులను రేవాలోని సంజయ్ గాంధీ హాస్పిటల్ కు తరలించామని అన్నారు. ఇక ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications