యోగా గురు రాందేవ్కు 600 ఎకరాలు దారాదత్తం
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి యోగపీఠ్ సంస్ధకు మహారాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమిని కేటాయించడంపై పలు విమర్శలకు తావిస్తోంది. అయితే ఈ భూమిని నారింజపళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆయుర్వేద ఉత్పత్తుల యూనిట్ల స్థాపనకోసం ప్రభుత్వం కేటాయించింది.
కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవంకులే, పతంజలి యోగపీఠ్కు చెందిన బాలకృష్ణ శుక్రవారం ఈ భూమి కేటాయింపుకు సంబంధించి ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసారు.
ఈ ఎంఓయూ ప్రకారం మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో 200 ఎకరాలు, మిహాన్ ప్రాంతంలోని సెజ్లో ఆయుర్వేద ఉత్పత్తుల యూనిట్ కోసం 450 ఎకరాలను మహారాష్ట్ర ప్రభుత్వం పతంజలి యోగపీఠ్ సంస్థకు కేటాయించింది. ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
ఈ భూపందేరంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ ప్రభుత్వం తన ఇష్టమొచ్చినవారికి ఇలా కారుచౌకగా భూమిని కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. నిజంగా పరిశ్రమలు స్థాపించేవారికి భూమిని ఇవ్వాలనుకుంటే ప్రకటనలు ఇవ్వటం, టెండర్లు జారీచేయటం చేసి ఉండేదని ఆరోపించారు.
పతంజతి యోగపీఠ్ సంస్ధకు కేటాయించిన 200 ఎకరాలు కూడా చాలా విలువైనది. ఎందుకంటే అదే సెజ్లో కార్గో హబ్కు సంబంధించిన పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రతిపాదించింది.