Bihar Polls: మహాకూటమి మ్యానిఫెస్టో విడుదల..! ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న విపక్ష మహాకూటమి ఇవాళ ఎన్నికల హామీలతో తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వీ యాదవ్ ఇతర భాగస్వామ్య పక్ష నాయకులతో కలిసి ఈ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇందులో కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పలు కీలక హామీలు ఉన్నాయి. తమకు అధికారమిస్తే ఈ హామీలన్నీ పక్కాగా అమలు చేస్తామని తేజస్వీ వెల్లడించారు.
బీహార్లోని ప్రతిపక్ష మహా కూటమి ఎన్నికలకు ముందు తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో తొలి హామీగా 20 రోజుల్లో ప్రతీ కుటుంబానికీ ఓ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు యువతకు భారీగా ఉద్యోగాల హామీలు ఇచ్చింది. అలాగే జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పిస్తామని కూడా మ్యానిఫెస్టోలో పేర్కొంది. వారికి 30 వేల రూపాయల నెల జీతం పెంచి చెల్లిస్తామని తెలిపింది.

రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్సోర్స్డ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయడం, ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడం వంటి హామీలు కూడా ఉన్నాయి. అలాగే క్షురకులు, కుమ్మరులు, వడ్రంగులు, కమ్మరి, తోటమాలి , చెప్పులు కుట్టేవారు వంటి శ్రామిక కులాల స్వయం ఉపాధి, ఆర్థిక అభ్యున్నతి, అభ్యున్నతి కోసం, 5 సంవత్సరాల పాటు ఒకేసారి 5 లక్షల వడ్డీ లేని మొత్తాన్ని అందిస్తామని మరో హామీ ఇచ్చారు. తమకు అధికారం ఇస్తే ఈ హామీలన్నింటినీ నిలబెట్టుకుంటామని తేజస్వీ యాదవ్ వెల్లడించారు. ఎన్డీయే కూటమి తరహాలో తాము తప్పుడు, అమలు కాని హామీలు ఇవ్వడం లేదన్నారు.












Click it and Unblock the Notifications