తొక్కిసలాటకు అదే కారణమా?: కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ పిలుపు
Mahakumbh 2025 stampede: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.
40 మందికి పైగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది.
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఆరా తీశారు. కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామని చెప్పారు. ప్రాణనష్టం తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ దిగ్భ్రాంతికర ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అమృత్, పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లే ప్రయత్నం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు.
ఈ ఘటన పట్ల లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడ్డ వాళ్లు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సహయాన్ని అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు.
నిర్వహణ లోపలే దీనికి కారణమని రాహుల్ గాంధీ, ఖర్గే వ్యాఖ్యానించారు. అమృత్ స్నాన్ చేయడానికి దేశం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. సామాన్య భక్తుల కంటే వీఐపీల సేవలో అధికారులు తరించారని విమర్శించారు.
మహా కుంభమేళా ముగియడానికి ఇంకా చాలా సమయం ఉందని, అమృత్ స్నాన ఘడియలు, తేదీలు ఇంకా ఉన్నాయని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. వీఐపీ కల్చర్కు పుల్ స్టాప్ పెట్టాలని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్షతగాత్రులకు వీలైనంత సహాయం అందజేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications