మహారాష్ట్రలో మరో కలకలం: కాంగో ఫీవర్, భయాందోళనలో ఆ జిల్లా జనం
ముంబై: ఇప్పటికే కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్రలో మరో కొత్త వ్యాధి ఇప్పుడు ప్రజలను భయకంపితులను చేస్తోంది. పాలఘర్ జిల్లాలో అతిభయంకరమైన కాంగో జ్వరం కలకలం సృష్టిస్తోంది. దీంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను పాల్ఘర్ పరిపాలన విభాగం ఆదేశించింది.

అధికార యంత్రాంగం అప్రమత్తం
కాంగో జ్వరం అని పిలువబడే క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్).. పేలు(చిన్నపాటి కీటకం) ద్వారా మానవులలో వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి జిల్లాలో గుర్తించబడటం ఆందోళనకర విషయమని జిల్లా యంత్రాంగం పేర్కొంది. పశువుల పెంపకందారులు, మాంసం విక్రేతలు, పశుసంవర్ధక అధికారులకు ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

ఈ వ్యాధికి చికిత్స లేదు..
ఈ వ్యాధికి సరైన వ్యాక్సిన్ లేదా మందులు, చికిత్స అందుబాటులో లేని కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే అత్యవసరమని సూచించారు. పాల్ఘర్ పశుసంవర్థక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డీ కాంబ్లే విడుదల చేసిన ఒక సర్కులర్లో కాంబో ఫివర్ గుజరాత్లోని కొన్ని జిల్లాల్లో కనుగొనబడిందని, ఇది మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. పాల్ఘర్ జిల్లా గుజరాత్లోని వల్సాద్ జిల్లాకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఇప్పటికే వల్సాద్ జిల్లాలో కొన్ని కేసులు నమోదయ్యాయని, నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

పేల ద్వారా.. జంతువుల నుంచి మనుషులకు.. తీవ్రమైనదే..
ఈ వ్యాధి ఒక నిర్ధిష్టం రకం పేల ద్వారా ఒక జంతువు నుంచి మరో జంతువుకు వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన జంతువుల రక్తం ద్వారా గానీ, వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినడం ద్వారా గానీ మానవులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. కాగా, ఈ వ్యాధిని నిర్ధారించి, చికిత్స చేయకపోతే 10-40 శాతం మంది రోగులు మరణించే అవకాశం ఉందన్నారు. సీసీహెచ్ఎఫ్ అనేది బున్యావిరిడే కుటుంబానికి చెందిన టిక్-బర్న్ వైరస్(నైరోవైరస్) కలిగి ఒక వ్యాధి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ఈ వ్యాధికి గురైతే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. దీంతో జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలని అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సోకిన వ్యక్తుల రక్తం, స్రావాలు, అవయవాలు లేదా ఇతర శారీరక ద్రవాలతో సన్నిహితంగా ఉండటం వల్ల మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ఆస్పత్రుల్లో వైద్య పరికరాల అశుభ్రత, సూదుల పునర్వినియోగం, వైద్య సామాగ్రిని కలుషితం చేయడం వల్ల కూడా ఈ అంటువ్యాధులు సంభవిస్తాయి. ఈ వ్యాధి ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వ్యాధితో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications