మహారాష్ట్రలో కరోనా కల్లోలం: కొత్తగా 40,925 కేసులు, ముంబైలోనే 20,971, ఢిల్లీలో 17,335
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్,సెకండ్ వేవ్లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో శుక్రవారం 20,971 కొత్త కోవిడ్ కేసులు,6 మరణాలు నమోదయ్యాయి.
కాగా, దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన 2020 మార్చి నుంచి ముంబైలో ఒక్కరోజులో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ముంబైలో గురువారమే మొదటిసారిగా కోవిడ్ కేసుల సంఖ్య 20వేలు దాటింది.

శుక్రవారం నమోదైన కేసుల్లో 84శాతం(17,616) అసింప్టమాటిక్(రోగ లక్షణాలు లేని)అని అధికారులు తెలిపారు. శుక్రవారం 1395మంది కోవిడ్ పేషెంట్లు హాస్పిటల్లో చేరారని, వీరిలో 88మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవరసమైనట్లు తెలిపారు. ఇక, తాజా కేసులతో కలిపి ముంబైలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 8,74,780కి చేరింది.
ముంబైలో కోలుకున్న రోగుల సంచిత మొత్తం 7,64,053, రికవరీ రేటు 87 శాతం. ముఖ్యంగా, ముంబై పోలీసులలో కనీసం 93 మంది సిబ్బంది ఒకే రోజులో COVID-19 కు పాజిటివ్ పరీక్షించారని ఒక అధికారి శుక్రవారం తెలిపారు.
మరోవైపు, మహారాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 40,925. గురువారం కంటే ఇవాళ 13శాతం కేసులు పెరిగాయి. ఇవాళ మహారాష్ట్రలో 20 మరణాలు నమోదయ్యాయి.
ఢిల్లీలో 17,335 తాజా కోవిడ్ కేసులు నమోదు, పాజిటివిటీ రేటు 17.73%
ఢిల్లీలో శుక్రవారం 17,335 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మరణాలతో పాటు మే 8, 2021 నుంచి అత్యధికంగా ఒకే రోజు పెరుగుదల ఇదే. దీంతో దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 17.73 శాతానికి పెరిగింది. నగరంలో 15.34 శాతం పాజిటివ్ రేటుతో 15,097 కొత్త కేసులు నమోదవడంతో గురువారం నుంచి ఇది గణనీయమైన పెరుగుదలగా అధికారులు చెబుతున్నారు.
23.34 శాతం పాజిటివ్ రేటుతో 17,364 కేసులు నమోదైన మే 8 తర్వాత 17,335 కేసులతో తాజా పెరుగుదల ఒకే రోజులో అత్యధికంగా పెరిగింది. ఆ రోజు 332 మరణాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications