"మహా"రాజకీయం: శరద్ పవార్ కీలకంగా శివసేనకు మద్దతు..రూటు మార్చిన కాంగ్రెస్..?
అయోధ్యపై తీర్పు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ఎన్సీపీలు పావులు కదుపుతున్నాయా..? శరద్ పవార్ కీలక పాత్ర పోషించనున్నారా..? శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ దిశగా ప్రయత్నాలు కూడా సాగుతున్నట్లు సమాచారం.

రూటు మార్చి శివసేనకు కాంగ్రెస్ మద్దతు ?
మహారాష్ట్రలో నవంబర్ 9తో అసెంబ్లీ గడువు ముగిసింది. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే బీజేపీ శివసేనల మధ్య వివాదం ఓ కొలిక్కి రాకపోవడంతో ఇక మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇవ్వరాదన్న యోచనలో కాంగ్రెస్ ఎన్సీపీలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు శివసేనకు మద్దతు ఇవ్వకూడదని భావించిన కాంగ్రెస్ ఇప్పుడు తన పంథాను మార్చుకున్నట్లు సమాచారం. శివసేనకు మద్దతు ఇస్తూనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాలని భావిస్తోంది.

ఇతర పార్టీ నాయకులతో టచ్లోకి పవార్
శుక్రవారం రోజున మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మీడియా సమావేశంలో శివసేనపై ధ్వజమెత్తిన తర్వాత కాంగ్రెస్ శివసేన పార్టీ నేతలు శరద్ పవార్ను కలిశారు. ముంబైలోని శరద్ పవార్ నివాసంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్లు ఆయన్ను కలిశారు. గత కొద్దిరోజులుగా పవార్ ఇతర పార్టీ నాయకులతో టచ్లోకి వచ్చి ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నట్లు ఎన్సీపీ వర్గాల సమాచారం.

శివసేన-ఎన్సీపీలకు కాంగ్రెస్ మద్దతు
ఎన్సీపీ శివసేన పార్టీలు ఒకే తాటిపైకి తీసుకురావడం పెద్ద కష్టమైన పనికాదని అయితే కాంగ్రెస్ అధిష్టానంను ఒప్పించడం చాలా కష్టమైందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. అంతేకాదు శివసేనకు మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాలుగా అండగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు కోల్పోతామేమోనన్న భయం ఉన్నిందని ఆయన చెప్పారు.అయితే మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం శివసేనకు సహకరిద్దామన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో హస్తం పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఆ కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారు.

స్పీకర్ పదవిని ఆశిస్తోన్న కాంగ్రెస్
ఇక ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైలెవెల్ మీటింగ్లో ముగ్గురు సీనియర్ నేతలు శివసేనకు మద్దతు ఇద్దామనే అభిప్రాయం వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ఇస్తే స్పీకర్ పదవి కాంగ్రెస్కు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్ర కాంగ్రెస్లో ఓ వర్గం మాత్రం ప్రభుత్వంలో భాగస్వాములు కావాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఈ అడుగు వేసిందనే సంకేతాలు రాష్ట్రంలోని మైనార్టీలు, ఇతర వెనకబడిన వర్గాలకు వెళతాయని సూచించినట్లు తెలుస్తోంది.

సువర్ణవకాశంగా భావిస్తున్న ఎన్సీపీ
మహారాష్ట్ర గ్రామీణప్రాంతాల్లో తమ క్యాడర్ను మరింత బలోపేతం చేసుకోవచ్చని భావిస్తున్న ఎన్సీపీ... ప్రభుత్వ ఏర్పాటును సువర్ణావకాశంగా చూస్తోంది. శివసేన ఎన్సీపీ కాంగ్రెస్లు కలిస్తే 154 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఇక చిన్నా చితకా పార్టీల నుంచి మరో 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని భావిస్తోంది ఎన్సీపీ. ఒకవేళ కాంగ్రెస్ ఇందుకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ ప్లాన్-బీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. శివసేన ఎన్సీపీలు కలిస్తే 110 అవుతుందని మరో 19 మంది స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఆ సంఖ్య 129కు చేరితే మరింకొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో ఎన్సీపీ ఉంది.












Click it and Unblock the Notifications