ఏక్ నాథ్ షిండేపై చర్యలకు దిగిన శివసేన-శాసనసభాపక్ష నేతగా తొలగింపు-రెబెల్స్ కు హెచ్చరికలు
మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో క్యాంపు రాజకీయాల నేపథ్యంలో అధికార శివసేన పార్టీ చర్యలకు దిగింది. ఇప్పటికే పరిస్ధితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన సీఎం ఉద్ధవ్ థాక్రే.. మిగతా ఎమ్మెల్యేలు జారిపోకుండా పలు చర్యలు తీసుకుంటుున్నారు. ఇదే క్రమంలో సంక్షోభానికి కారకుడైన ఏక్ నాథ్ షిండేను శివసేన శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించారు.
సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, 10-12 మంది శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ పరిణామంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. మహారాష్ట్ర రాజకీయ రంగంలో తిరుగుబాటుపై చర్చించిన అనంతరం మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మహావికాస్ అఘాడీ కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కూటమిలో మిగతా రెండు పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ స్పందించాయి.
మహారాష్ట్రలో పరిణామాలు చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ ను అక్కడికి పంపింది. అలాగే మరో భాగస్వామి ఎన్సీపీ శివసేన అంతర్గత పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అయితే బీజేపీతో మాత్రం జట్టుకట్టే ప్రసక్తే లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. తమ పార్టీఎన్సీపీ మాత్రం ఐక్యంగానే ఉందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాక్రేకు కొంత మేర ఊరట లభించినట్లయింది.